Wednesday, May 8, 2024

క‌రోనా భ‌యం – జ‌నంలో మార్పు

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం….
కరోనా వైరస్‌ భయం
తగ్గిన విచ్చలవిడితనం
నిబంధనలు పాటింపు
నిపుణుల సూచనలకు ఓకే వ్యాక్సిన్‌ల కోసం పరుగులు
పెరిగిన భద్రత శ్రీ చైతన్యం కొనసాగాలి
వేగంగా టీకాలు ఇవ్వాలి
సామాజిక వేత్తల సూచనలు

ప్రజల్లో మార్పొస్తోంది. కరోనా పట్ల భయం పెరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల్ని పాటిస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. వీటి ప్రభావం ఇప్పటికే కోవిడ్‌ కేసుల నమోదుపై కనిపిస్తోంది. మహరాష్ట్రలో పూర్తి లాక్‌డౌన్‌ అమలు మొదలైన వారం తర్వాత కొత్త కేసుల నమోదులో గణనీయ తగ్గుదల కనిపించింది. ఇదే ప రిస్థితి అన్ని చోట్లా స్పష్టమౌతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజుల క్రితమే పాక్షిక కర్ప్యూ అమల్లోకొచ్చింది. ప్రజలు దీనికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల్ని గౌరవిస్తున్నారు. కరోనా బారిన పడకూడదని యోచిస్తున్నారు.

న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి ….
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలే సత్ఫలితాల్నిచ్చాయి. యదావిధిగా జనసంచారం ఉన్న రోజుల్లో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సంక్రమణాన్ని నియంత్రించలేక పోయారు. లాక్‌డౌన్‌ల్తోనే ఇది కట్టడికి గురైంది. రెండో తరంగం నేపధ్యంలోనూ భారత్‌ ఇప్పుడు అంచెలంచె లుగా లాక్‌డౌన్‌ వైపు వెళ్తోంది. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో మరోసారి పూర్తిస్థాయి మూసివేతకు కేంద్రం సిద్దంగా లేదు. తీవ్ర ఆర్ధిక మాంద్యం, నిరు ద్యోగం, ఉపాధి అవకాశాల తగ్గుదల, ధరల పెరుగుదల వంటి అంశాల నేపధ్యంలో కర్ఫ్యూ కారణంగా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది. పథకాల అమలు నెమ్మదించింది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దెబ్బతీసింది. ఈ కారణంగా ఈసారి కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. లాక్‌డౌన్‌లపై నిర్ణయాల్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాలు ఈ దిశగా అడుగు లేయడం మొదలెట్టాయి. ఓవైపు ఉత్పత్తికి, ఉపాధి అవకాశాలకు విఘాతం లేకుండా మరోవైపు

(మొదటిపేజీ తరువాయి)
కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుం టున్నాయి. జనం కూడా కరోనా అంటే భయపడే పరిస్థితొచ్చేసింది. జనంలో విచ్చలవిడితనం తగ్గింది. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలన్న జిజ్ఞాస పెరిగింది. ఓ వైపు జనసంచారం కట్టడి, మరోవైపు మాస్కుల ధారణ, భౌతికదూరం పాటించడంలతోనే కరోనాను కట్టడి చేయగలమన్న నిపుణుల సూచనలు ఇప్పుడు జనం తలకెక్కుతున్నాయి. వీటిని పాటించి ఇజ్రాయెల్‌, అమెరికా వంటి దేశాలు కరోనా సంక్రమణ వ్యాప్తిని నియంత్రించిన వైనాన్ని ఇప్పుడు జనం అర్ధం చేసుకుంటున్నారు. వ్యాక్సిన్‌లొచ్చిన కొత్తలో వాటిపట్ల విముఖత చూపిన జనం ఇప్పుడు వాటి కోసం పరుగులుదీస్తున్నారు. వ్యాక్సిన్‌ల అవసరాన్ని తెలుసు కోవడమే కాదు.. పదిమందికి ప్రచారం చేస్తున్నారు. అక్కడకక్కడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నా ఈ సారి లాక్‌డౌన్‌లు, కర్ప్యూల నిర్వహణ యంత్రాం గానికి సులభతరంగానే ఉంది. ఎక్కడా పోలీసులు తమ లాఠీలకు పనీ చెప్పాల్సిన పరిస్థితులు తలెత్తడంలేదు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత కొనసాగు తూనే ఉంది. రోజు రోజుకు కోవిడ్‌ మరణాలు పెరుగు తున్నాయి. ఆసుపత్రుల్లో పడకలు లభించడం గగనకు సుమంగా మారింది. ఉన్న ఆసుపత్రులు సరిపోవడం లేదు. ఉన్నవాటిలో సదుపాయాలు రోగుల అవస రాలు తీర్చలేక పోతున్నాయి. కొంతకాలం ప్రభుత్వం ఆసుపత్రుల సంఖ్య పెంపు, నిర్వహణపై దృష్టి పెట్టడంపై ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అవసరమైతే సంక్షేమ పథకాల నిధుల్ని మళ్ళించాలి. ఆసుపత్రుల్లో ఆదనపు సౌకర్యాల కల్పనకు వీటిని వెచ్చించాలి. ముఖ్యంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ల నిర్మాణం, ఆక్సిజన్‌ రవాణా, వంటి వాటికి అధిక మొత్తాలు కేటాయించాలి. ప్రస్తుతం ఆక్సిజన్‌ అతిముఖ్య అవస రంగా మారిపోయింది. అయితే కొరత నివారణకు యంత్రాంగం చేపడుతున్న చర్యలు నెమ్మదిగా సత్ఫలి తాల్నిస్తున్నాయి. మూతబడ్డ ఆక్సిజన్‌ ఫ్లాంట్‌లు కూడా తెరుచుకుంటున్నాయి. పరి శ్రమల్లో ఇతర అవసరాల్నుంచి ఆక్సిజన్‌ను వైద్య అవసరాల నిమిత్తం మళ్ళిస్తున్నారు. వీటి రవాణాకు పోలీసు బందోబస్తుతో పాటు కొన్ని చోట్ల సైన్యంతో కూడా కాపలా ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రభుత్వాసుపత్రులు సొంతంగా ఆక్సిజన్‌ తయారీకి ఉపక్రమిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అతి కొద్ది సమయంలోనే కరోనా మర ణాలు అదుపులోకొస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పాక్షిక కర్ప్యూలు, పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ల నేపధ్యంలో ప్రజల్లో వచ్చిన మార్పు కొనసాగితే కొత్త కేసుల నమోదును నెలరోజుల్లోపు నియంత్రించగలిగే అవకాశముంటుంది. ఇక కోవిడ్‌ మూడో తరంగం ఊహాజనితమైంది. ఇది దేశంలో ఏ మేరకు విస్తరిస్తుం దన్నది ఇప్పటికింకా స్పష్టమైన ఆధారాల్లేవు. అయితే ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మరోసారి కోవిడ్‌ విరుచుకుపడుతుందన్నది శాస్త్రవేత్తల అంచనా. కానీ జనంలో మార్పొచ్చి కరోనా నియంత్రణా చర్యల్ని పకడ్బందీగా అమలు చేస్తే మూడో తరంగం రాకుండానే తప్పించుకోగలిగే వెసులుబాటుంటుం దని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుక్కావా ల్సిందల్లా ప్రజల్లో కరోనా పట్ల ఇప్పుడొచ్చిన చైతన్యం, భయం కొనసాగడం, టీకాల ప్రక్రియ మరింత వేగంగా జరగడమేనని పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement