Sunday, April 28, 2024

Escape – విశాఖలో ఖైదీ పరారీ! సెంట్రల్ జైలులోనే పక్కా ప్లాన్…

పోస్కో కేసులో దోషి
మెటల్ గోర్లు.. జీఐ వైర్లు మింగేశాడు
చికిత్స కోసం కేజీహెచ్‌లో చేరిక‌
ఎస్కార్ట్‌ని తోసి మాయం
అడుగడుగునా భద్రతలోపం
పని చేయని సీసీ కెమెరాలు
పట్టించుకోని ప్రైవేటు సెక్యూరిటీ
అయినా కేసు న‌మోదు చేయ‌ని పోలీసులు

ఆంధ్రప్రభ, విశాఖ క్రైం: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని విశాఖ కేజీహెచ్ .. క్రమేపీ నేరగాళ్ల అడ్డగా మారిపోయిందంటే కేవలం ఆరోపణ కాదు. అనారోగ్యం పేరుతో కేజీహెచ్ లో చేరి.. పోలీసుల కళ్లగప్పి పారిపోయే నేరగాళ్లకు అనువైన ప్రాంతంగా మారిపోయింది. తాజాగా ఇలాంటి ఘటనే శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు చోటు చేసుకుంది. ఇక్కడ చికిత్స పొందుతున్న ఓ కరుడుగట్టిన ఖైదీ వాష్ రూమ్ కి వెళ్లి తనకు సెక్యూరిటీ పోలీసును పక్కకు నెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. కేజీహెచ్ లో ఈ ఘటనతో పోలీసులు, విశాఖ జిల్లా యంత్రాంగం, కేజీహెచ్ సిబ్బంది అవాక్కయ్యారు. అప్రమత్తమయ్యారు.

- Advertisement -

ఎస్కార్ట్కు ఝలక్ …

తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం, పెదవలస గ్రామానికి చెందిన బోన్నిధి మహాలక్ష్మి అలియాస్ రాజు పోలీసులు కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పారిపోయాడు. పోస్కో కేసులో కోర్టు రెండేళ్ల శిక్షను విధించింది. విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. 2022 జూన్ 13 నుంచి ఈ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి పారిపోవటానికి పక్కా ప్లాన్ రచించాడు. 2024 మార్చి 11న మెటల్ గోర్లు, జీఐ వైర్ ముక్కలు తిన్నాడు. కడుపునొప్పి బాధపడుతున్నాడని చికిత్స కోసం కేజీహెచ్‌కి తరలించి రాజేంద్ర ప్రసాద్ వార్డులో చేర్పించారు. మార్చి 22న శస్త్రచికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ వార్డులోకి నిందితుడిని మార్చారు. ఇక ఏప్రిల్ 5 న రాత్రి రెండు గంటల సమయంలో డ్యూటీలోని ఎస్కార్ట్ పోలీస్ కు వాష్ రూమ్‌కి వెళ్లాలని చెప్పి అతడిని తోసేసి ఆ వార్డు నుంచి నిందితుడు పారిపోయాడు.వెంటనే ఎస్కార్ట్ రాజనా కళ్యాణ్ (39) పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కేజిహెచ్ లో భద్రత డొల్ల..

కేజీహెచ్ లో భద్రత డొల్లతనం మరోసారి స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ సీసీ కెమెరాలు సరిగా పనిచేయవు. సిబ్బంది నిర్లక్ష్యమూ యథాతథం. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఏదైనా జరిగినా మనకెందుకులే అని పట్టించుకోరు. ఇలాంటి స్థితిలో కేజీహెచ్ ప్రతిష్ట నీరుగారుతోంది. రెండేళ్ల జైలు శిక్ష పడిన ఖైదీ అక్కడ నుంచి పరారీ కావటమే ఇందుకు నిదర్శనం. దీనికి తోడు ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం మరీ విడ్డూరం. కేజీహెచ్ లో పోలీసు ఆధీనంలోని నేరస్తులే తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారంటే ఆ హాస్పటల్లో పరిస్థితులు నేడు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.పెద్ద ఆస్పత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. లేనట్టుగానే మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement