Thursday, May 16, 2024

AP | ఈతకు వెళ్లి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి.. చిత్తూరు జిల్లాలో ఘ‌ట‌న‌

కుప్పం, (ప్రభ న్యూస్ ): చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో మొదటి సంవత్సరం చ‌దువుతున్న‌ విద్యార్థి బావిలో ఈతకు వెళ్లి చ‌నిపోయాడు. ఈ ఘటన ఇవ్వాల (బుధవారం) మ‌ధ్యాహ్నం జ‌రిగింది. కుప్పం ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో అనంతపురం జిల్లాకు చెందిన హరిక్రిష్ణ రెడ్డి (19) కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి కాలేజీ వెనుక, మాటర్ల పల్లి వద్ద ఉన్న వ్యవసాయ బావిలో ఈత కోసం వెళ్లారు.

బావిలోకి దిగిన హరికృష్ణ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్న వారు కేకలు వేశారు. దీంతో చుట్టుప‌క్కల వారు వచ్చి గ‌ల్లంతైన హ‌రి కోసం వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది గాలించి విద్యార్థి మృతి దేహాన్ని బయటకు తీసి, కుప్పం పోలీసులకు అప్పాజెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement