Saturday, April 27, 2024

Pawan Kalyan – పిఠాపురానికి ఆరు గ్యారెంటీలు.. ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని

30 నుంచి పిఠాపురంలో ఎన్నిక‌ల ప్ర‌చారం
తూర్పు, ప‌శ్చిమంలో ఏక‌ధాటిగా ప‌ర్య‌ట‌న‌లు
వారాహి వాహ‌నంలోనే విస్తృత ప్ర‌చారం
షెడ్యూల్ ఖ‌రారులో ప‌వ‌న్ యంత్రాంగం

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేష‌న్ రానున్న వేళ ఏపీలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్ని సీట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయబోతోన్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక నియోజకవర్గంలో ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఈ నెల 30న ఆయన పిఠాపురానికి వెళ్లనున్నారు. వారాహి వాహనంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేపట్టనున్నారు. దీనితో పాటు జనసేన పార్టీ అధినేతగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. కూటమి బహిరంగ సభలు, రోడ్ షోల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొననున్నారు. ఎక్కువగా కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప‌వ‌న్ పాల్గొనే అవకాశాలున్నాయి. కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధికంగా ఉండే జిల్లాలు కావడమే దీనికి ప్రధాన కారణంగా పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఆరు వ‌రాల‌తో ఆక‌ట్టుకునే య‌త్నం..

పిఠాపురంలో ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి ముందే పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గంపై వరాలను కురిపిస్తున్నారు. శాసన సభ్యుడిగా తనను ఎన్నుకుంటే ఎలాంటి అభివృద్ధి పనులను చేపడతాననేది ప్రకటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే వాటిని నెరవేర్చేలా కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో ఆరు హామీలను పిఠాపురం ఓటర్లకు వ‌రంగా ఇవ్వ‌బోతున్నారు.

  1. యువత సహా అర్హులైన వారందరికీ ఉద్యోగ అవకాశాల కల్పన
  2. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం
  3. ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి
  4. పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి పర్చడం
  5. ఇక్కడి మత్స్యకారులకు ప్రత్యేకంగా జెట్టీల నిర్మాణాన్ని చేపట్టడం
  6. కోస్టల్ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం- అనే ఆరు హామీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఇది తామిచ్చే వాగ్దానమని, తనను గెలిపించుకోవడం పిఠాపురం ప్రజల బాధ్యత అంటూ కొత్త స్లోగన్‌ను పవన్ కల్యాణ్ తీసుకొచ్చారు. ఇవే హామీలు, ఇదే నినాదంతో పిఠాపురం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement