Monday, May 6, 2024

Tirupati – శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుపతి నవంబరు 19, (ప్రభ న్యూస్ ప్రతినిధి): బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్య కైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార,అనధి కారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా నిర్వహించారు.

ఉదయం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖకు దాతలు సమర్పించిన 3 టన్నుల పుష్పాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు పుష్పాలు, పత్రాలను అందించారు. మధ్యాహ్నం ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం జరిగింది. వైదికుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి.ధర్మా రెడ్డి దంపతులు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈవో రమేష్, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీవాణి, మధుసూదన్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు గణేష్,సుభాష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement