Monday, April 29, 2024

సీఎం జగన్ ను కలిసిన నీతిఆయోగ్‌ సలహాదారు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో నీతిఆయోగ్‌ సలహాదారు శాన్యుక్తా సమద్దార్, నీతిఆయోగ్‌ ఎస్‌డీజీ ఆఫీసర్‌ అలెన్‌ జాన్, నీతిఆయోగ్‌ డేటా ఎనలటిక్స్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ దాస్, ఏపీ ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21 రిపోర్ట్‌ను ముఖ్యమంత్రికి నీతిఆయోగ్‌ బృంద సభ్యులు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యతను నీతిఆయోగ్‌ సభ్యులకు సీఎం జగన్ వివరించారు. నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీస్‌) ఇండియా ఇండెక్స్‌ 2020–21, మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎంపీఐ) రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ జరగనుంది.

ఎస్‌డీజీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రాన్ని మొదటి స్ధానంలో నిలిపేందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలనే అంశంపై చర్చించారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై రాష్ట్ర, జిల్లా స్ధాయి అధికారులకు నీతిఆయోగ్‌ ఆధ్యర్యంలో దిశానిర్ధేశం చేసినట్లు సీఎంకి అధికారుల బృందం వివరించారు. ఏపీ ప్రభుత్వం సుస్ధిరాభివృద్ది లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించుకునేందుకు కృషి చేస్తుందని ముఖ్యమంత్రితో జరిగిన చర్చలో అధికారులు వెల్లడించారు. నవరత్నాలలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రశంసించారు నీతిఆయోగ్‌ సభ్యులు.

ఇది కూడా చదవండి: దళిత దండోరాకు ఆ నేతలు వస్తారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement