Monday, April 29, 2024

నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను: నారా లోకేష్ వార్నింగ్

టీడీపీ కోసం ప్రత్యేక ఐపీసీ సెక్షన్‍ను వైసీపీ పెట్టిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఇప్పుడు తనపై మర్డర్ కేసు సహా 13 కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రజల తరపున పోరాడుతున్నందుకే తమపై దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య తర్వాత చంద్రబాబుపై అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ మీడియా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. గురువారం విశాఖ కోర్టు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారన్న ఆయన..తమ వ్యక్తిగత జీవితంపై కూడా బురద జల్లిందని ఆరోపించారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. తాను వేటికి భయపడను అని.. తప్పుడు వార్తలు రాస్తే చట్టప్రకారం ముందుకు వెళ్తానని హెచ్చరించారు. తన తల్లిపై అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడారని, విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అని వ్యాఖ్యానించారు. మా సంస్కృతి అది కాదు.. ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశానని పేర్కొన్నారు. తన తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని నారా లోకేష్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement