Tuesday, April 16, 2024

ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ రారాజు.. సింహం లాంటిది టీఆర్​ఎస్​: క‌ల్వ‌కుంట్ల క‌విత‌

టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది.. తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయింద‌ని ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడిగా ముజిబుద్దీన్ గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత హాజ‌రై ప్ర‌సంగించారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల్లో జ‌రుగుతున్న అన్యాయాల‌ను ఎండ‌గడుతూ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని లెక్క‌ల‌తో స‌హా చెప్పి ప్ర‌జ‌ల‌ను ముందుకు న‌డిపించాం. టీఆర్ఎస్ పార్టీని ప్ర‌జ‌లు న‌మ్మి, వెంట న‌డిచారు. అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్‌ను రెండు సార్లు సీఎం చేశారు. అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ 70 ల‌క్ష‌ల స‌భ్య‌తాల‌కు చేరుకుంది. టీఆర్ఎస్ పార్టీ న్యాయం, ధ‌ర్మం వైపే ఉంది అని క‌విత స్ప‌ష్టం చేశారు.

క‌రోనా కాలంలో వ‌ల‌స కార్మికుల‌కు అన్నం పెట్టామ‌ని క‌విత గుర్తు చేశారు. రెండేండ్లు క‌రోనా ఉంటే కూడా రాష్ట్రంలో ఆస‌రా పెన్ష‌న్లు, రైతుబంధు, రేష‌న్ బియ్యం ఆగ‌లేదు. మ‌నం సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను ఆప‌లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ‌ల‌స కార్మికుల‌ను ఆదుకోలేదు. మ‌నం రైతుల‌కు అన్నం పెడుతుంటే మోదీ సున్నం పెడుతుండు. వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌ని మోదీ అంటుండు. తెలంగాణ‌కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల‌పై టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంట్‌లో పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ ఎంపీలు మాత్రం నోరు మెద‌ప‌రు. తెలంగాణ హ‌క్కుల‌పై కేంద్రాన్ని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నిల‌దీయడం లేదు. పేద ప్ర‌జ‌ల కోసం పోరాడుతున్న‌ది కేవ‌లం టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే. అనేక ప‌థ‌కాల అమ‌లులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌లో నిలిచింది. ఏడేండ్ల‌లో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగ‌తి సాధించింది అని క‌విత తెలిపారు.

అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నెంబ‌ర్ వ‌న్..
కేంద్ర బ‌డ్జెట్‌పై కేసీఆర్ బీజేపీ నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తే ఇప్ప‌టికీ స‌మాధానం రాలేదు. అబ‌ద్దాలు చెప్ప‌డంలో, మాయ‌మాట‌లు చెప్ప‌డంలో, ఫేక్ స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డంలో, ఫేక్ ఫోటోలు షేర్ చేయ‌డంలో, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డంలో, రైతుల‌ను, పేద‌ల‌ను మోసం చేయ‌డంలో, దేశ సంప‌ద‌ను అమ్మ‌డంలో బీజేపీ నంబ‌ర్ వ‌న్ అని క‌విత విమ‌ర్శించారు. మాయ‌మాట‌లు చెప్పి, మ‌భ్య‌పెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి రావాల‌ని బీజేపీ య‌త్నిస్తోంది. కానీ టీఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీ కాద‌న్నారు. ఓపిక‌ను, స‌హ‌నాన్ని, మంచిత‌నాన్ని చేత‌గాని త‌నంగా తీసుకోవ‌ద్దు. కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు బాగుప‌డ్డ చ‌రిత్ర లేదు. బాగుప‌డే ముచ్చ‌ట‌నే లేదు. మేం నీతితో, న్యాయంతో, ధ‌ర్మంతో ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయి 24 గంట‌లు ప‌ని చేసేవాళ్లం. రాష్ట్రంలో మ‌మ్మ‌ల్ని డిస్ట‌ర్బ్ చేస్తే.. మేం ఢిల్లీ దాకా వ‌చ్చి మీ సంగ‌తేంతో చూస్తాం అని ఎమ్మెల్సీ క‌విత హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement