Tuesday, May 7, 2024

రాంకీ గ్రూప్‌లో నాకు షేర్లు లేవు: వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల

వైసీపీ ఎంపీ అయోధ్య రామ రెడ్డి కి చెందిన రాంకీ సంస్థల్లో ఇటీవ‌ల ఆదాయపన్ను శాఖ తనిఖీలు నిర్వ‌హించిన నేపథ్యంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2006లో తాను రాంకీ సంస్థలో ఉద్యోగం చేశానని ఆయ‌న చెప్పారు. 2006 నుంచి 2021 వరకు రాంకీ గ్రూప్‌లో తనకు ఏ విధమైన షేర్లు లేవని అన్నారు. ఆ సంస్థ షేర్లు, మూలధనం వివ‌రాల‌ను టీడీపీ నేతలు తెలుసుకోవాలని ఆయ‌న సూచించారు. అలాగే, దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలని సవాల్ విసిరారు. తన రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. గ‌తంలో పుష్కరాల పేరుతో తాడేపల్లిలో టీడీపీ స‌ర్కారు రెండువేల ఇళ్లను తొలగించిందని ఆరోపించారు.

కాగా , ఇటీవల రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. సంస్థలతోపాటు ఎంపీ ఇంట్లో కూడా సోదాలు చేశారు. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement