Wednesday, May 1, 2024

AP: మహిళల జీవితాలు మార్చేందుకే మహాశక్తి పథకం.. చంద్రబాబు

ఉమ్మడి కర్నూలు జిల్లా (బనగానపల్లె) : మహిళల జీవితాలు మార్చేందుకే మహాశక్తి పధకం రూపొందిచామని అధికారంలోకి రాగానే అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలో మహిళా ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… మహిళా ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన నా ఆడపడుచులందరికీ స్వాగతం.. సుస్వాగతం. మీతో కలిసి మీ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడం ఆనందించాల్సిన విషయమన్నారు. గతంలో డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు ముందు ఇలానే ఆడబిడ్డలతో సమావేశమయ్యాను. ఇప్పుడు మీకోసమే ‘మహాశక్తి’ కార్యక్రమం తీసుకొచ్చానన్నారు. దానిలో భాగంగా చరిత్రలో గతంలో ఏంచేశామో ఆలోచిస్తేనే భవిష్యత్ లో ఎలా ముందుకెళ్లాలో తెలుస్తుందన్నారు. ఆడబిడ్డలు అన్నిరంగాల్లో మగవారితో సమానంగా రాణించాలని ఎన్టీఆర్ ఆలోచించారన్నారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించారన్నారు. వారి ఉన్నత విద్యకోసం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారన్నారు.

రాజకీయాల్లో కూడా వారిని ప్రోత్సహించి, స్థానిక సంస్థల్లో వారికోసం 9శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారన్నారు. ఆ మహానుభావుడు తీసుకొచ్చిన 9శాతం రిజర్వేషన్లను తాను 33 శాతానికి పెంచానన్నారు. చట్టసభల్లో కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది నా కోరిక.. డిమాండ్ అన్నారు. దానికోసం తాను ఎప్పుడూ ఆడబిడ్డలకు అండగానే ఉంటా.. అవసరమైతే పోరాడతానన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో పాఠశాలలు లేకపోతే, ఆడపిల్లల ఇబ్బంది గమనించి, ప్రాథమిక విద్యకోసం ప్రతి కిలోమీటర్ కు ఒక ఎలిమెంటరీ స్కూల్, మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇజనీరింగ్ కాలేజీ, జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించానన్నారు. దానివెనకున్న ముఖ్యఉద్దేశం స్త్రీవిద్యే. 30సంవత్సరాల కంటే ముందే ఆడబిడ్డల చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, వారి తెలివితేటలతో ఒనగూరే ఫలితాలను గుర్తించానన్నారు. జనాభాలో 50శాతం మహిళలు ఉంటే, అందరూ చదువుకునేలా చేశామన్నారు. ఆడబిడ్డలు చిన్నతనం నుంచే వివక్షత ఎదుర్కొంటారన్నారు. పుట్టినప్పటి నుంచి యుక్తవయస్సు వరకు తల్లిదండ్రులపై, తరువాత భర్తలపై, అనంతరం బిడ్డలపై ఆధారపడే పరిస్థితి అన్నారు.

చిన్నచిన్న ఖర్చులకు కూడా వారినే అడగాల్సిన పరిస్థితి. ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండా బతికేశారన్నారు. అలాంటి జీవితాలను డ్వాక్రా సంఘాలతో ఉన్నతంగా తీర్చిదిద్దానన్నారు. మహిళా శక్తి ప్రభావం ఎలా ఉంటుందో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో డ్వాక్రా సంఘాలతో చేసి చూపించానన్నారు. డ్వాక్రా మహిళలు విదేశాల్లో కూడా ఉపన్యాసాలిచ్చారు. అదీ తెలుగుదేశం మీకు అందించిన గొప్ప అవకాశమన్నారు. ఇప్పుడు నూటికి 75శాతం ఆడవారే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆడవారికి బ్రెయిన్ కుడివైపున బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటే, మగవారికి ఎడమవైపున ఎక్కవ ఉంటుంది. తెలివితేటల్లో మగవాళ్లకంటే ఆడవాళ్లే మిన్న అని ఇటీవలే నిరూపితమైందన్నారు. భగవంతుడు మహిళలకు ఓర్పు, సహనం అందించాడన్నారు. కుటుంబాల నిర్వహణతో పాటు, బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడంలో మీకు మీరేసాటి. 1997లో ఆడబిడ్డలు పుడితే దండగని భావిస్తున్న రోజుల్లో బాలికా శిశుసంరక్ష పథకం తీసుకొచ్చి, ఆడబిడ్డ పుట్టిన వెంటనే తనపేరుతో బ్యాంకులో రూ.5వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. తరువాత ఆ డబ్బుని పెళ్లి కోసం, ఆడబిడ్డల చదువుకోసం వినియోగించేలా చేశానన్నారు. మగపిల్లలతో సమానంగా ఆడబిడ్డలు చదువులో రాణించాలని 8, 9, 10 తరగతుల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందించానన్నారు. మహిళలు కట్టెలపొయ్యిల పై వంటచేస్తూ కన్నీళ్లు పెడుతుండటాన్ని చూసి ఓర్వలేక, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించాను. ఒకప్పుడు గ్రామాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు రోడ్లపైకి వెళ్లేవారు. కాలకృత్యాల సమయంలో వారు పడే ఇబ్బందులు, అవమానాలు గమనించి ఉచితంగా మరుగుదొడ్లు కట్టించింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 2014-19 మధ్య డ్వాక్రా సంఘాలకు రూ.8,500కోట్ల రుణమాఫీ చేశామన్నారు. పసుపు కుంకుమ కింద రూ.10వేలకోట్ల ఆర్థికసాయం అందించానన్నారు. 11 రకాల ఉచిత వైద్యపరీక్షలు మహిళలకు ఉచితంగా చేయించామన్నారు. బాలింతలకు, గర్భిణులకు అన్న అమృత హస్తం పథకం కింద బలవర్ధకమైన పౌష్టికాహారం అందించింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. నవజాత శిశువులకు బేబీకిట్లు అందించాం. సామూహిక శ్రీమంతాలు జరిపించాం. పెళ్లికానుక కింద యువతులకు ఆర్థికసాయం అందించాం. తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి తల్లులపై బిడ్డల్లో గౌరవాభి మానాలు పెంచామన్నారు.

- Advertisement -

వైసీపీలో కీచకులు… కేసులున్న వారే ఆపార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు
వైసీపీలో కీచకులే ఎక్కువ. ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడిన ముగ్గురికి జగన్ రెడ్డి ఎంపీ సీట్లు ఇచ్చాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై 400లకు పైగా కేసులున్నాయి. వైసీపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచడంతో మహిళలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్, బియ్యం, నూనెలు, వంటగ్యాస్ ధరలు పెరిగాయన్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచారు. వీటన్నింటిపై వైసీపీ మేం పెంచలేదని సమాధానం దాటవేస్తుంది. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడే ధరలు పెంచారన్నారు. మహిళల జీవితాలు రోడ్డున పడేసేలా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేశాకే మరలా మీ వద్దకు వచ్చి ఓటు అడుగుతాను అని మహిళల్ని నమ్మించాడు. మద్యాన్ని నిషేధించకుండా నాసిరకం మద్యం విక్రయిస్తూ, ప్రజల రక్తం తాగుతున్నాడన్నారు. మద్యం అమ్మకాలతో ఇప్పటికే చాలా కుటుంబాలు చితికిపోయాయి, మరోపక్క గృహహింస ఎక్కువైందన్నారు. దాంతో నేరాలు ఘోరాలు పెరిగాయన్నారు. మద్యం కొనలేక చాలామంది గంజాయి సేవిస్తున్నారు. దాంతో నేరాలు ఇంకా ఎక్కువయ్యాయి. మహిళలపై అత్యాచారాలు, నేరాలు, ఘోరాల్లో రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు. నేరాలు ఘోరాల్లో జాతీయ స్థాయితో పోలిస్తే, రాష్ట్రంలో 44శాతం అధికమన్నారు. సెక్సువల్ వేధింపులు జాతీయ స్థాయికంటే 65 శాతం ఏపీలోనే అధికమన్నారు. ప్రతి మూడు గంటలకు ఒక మహిళపై దాడి, ప్రతి 8 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళల రక్షణకోసం తీసుకొచ్చిన ఫోర్త్ లయన్ యాప్ ను దిశా యాప్ అని పేరు మార్చారన్నారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. నిర్భయనిధి కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని టీడీపీ ప్రభుత్వం 5.4శాతం ఖర్చుపెట్టిందన్నారు. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో కేవలం 1.4శాతమే ఖర్చుపెట్టిందన్నారు.


బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ అనే కార్యక్రమం తీసుకొచ్చాను. దానిలో భాగంగా మహశక్తి పథకంలో మహిళలకు అనేక పథకాలు ప్రకటించాను. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, ఒక్కొక్కరికీ ఏటా రూ.15వేలు అందిస్తాను. ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్లు పైబడి 60ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1500లు అందిస్తాను. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. మీ చేతుల్లో ఉండే సెల్ ఫోన్ల ద్వారానే మీకు ఆదాయం వచ్చేలా కొత్త ప్రణాళికలు ప్రకటిస్తాను. ఇంట్లోనే ఉండి మీరు మీజీవితాలు బాగు చేసుకునేలా, సంపద సృష్టించే విధానానికి శ్రీకారం చుట్టబోతున్నాను. నా ఆలోచనలు సాకారం కావాలంటే అందుకు మీ సహకారం ఎంతో అవసరం. అదే విధంగా మీ బిడ్డలకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాను. భవిష్యత్ లో విద్యుత్ ఛార్జీలు పెరగకుండా, నాణ్యమైన విద్యుత్ అందిస్తాను. ఇప్పుడు నెలానెలా కట్టే విద్యుత్ బిల్లు సొమ్ము మీకే మిగులుతుంది. అలానే పెట్రోల్, డీజిల్ కు బదులు విద్యుత్ తో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తాయి. ఆ విధంగా కూడా మీకు మేలు జరుగుతుంది. రైతుల కోసం అన్నదాత పథకం కింద ఏటా రూ.20వేల ఆర్థికసాయం ప్రకటించాను. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల రక్షణకోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాను. నేను మీకు చెప్పేదొకటే. సాంకేతిక పరిజ్ఞానంతో, తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు. నేను చెప్పింది విని వదిలేయడం కాదు… మనసుపెట్టి ఆలోచించండి. మగవాళ్లు నేను చెప్పినదానిపై సంశయిస్తారు గానీ, ఆడబిడ్డలు తూచా తప్పకుండా పాటించారు. అందుకే మీరంటే నాకు అభిమానం. రాబోయే రోజుల్లో మంచి రోజులు చూస్తారు. మీద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement