Tuesday, April 30, 2024

Longest RRB – గూడూరు-మనుబోలు రైల్వే స్టేషన్‌ల మ‌ధ్య‌ అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం…

విజయవాడ ప్రభ న్యూస్ – విజయవాడ డివిజన్‌లోని గూడూరు-మనుబోలు రైల్వే స్టేషన్‌ల మధ్యకొత్త రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌. ఓ.ఆర్‌)ను నిర్మించి ప్రారంభించారు.2.2 కి.మీల నిడివితో నిర్మించిన ఈ రైల్ ఫ్లైఓవర్ దక్షిణ మధ్య రైల్వేలో 7వ రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌.ఓ.ఆర్‌) గా నిలిచింది. ఇంతేకాకుండా ఇది జోన్‌లో అతి పొడవైన ఆర్‌ఓఆర్‌/రైల్ ఫ్లైఓవర్ కూడా ఇదే. గతంలో జోన్ లో అత్యంత పొడవైన రైల్ ఫ్లైఓవర్ 40 మీటర్లు మాత్రమే ఉండేది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 2.2 కిలోమీటర్ల పొడవుకలిగిన ఈ ఫ్లైఓవర్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలో నిర్మించబడినది. ఈ ఫ్లైఓవర్ పిఎస్ సీ (ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్) కాంపోజిట్ గర్డర్‌లను కలిగిఉంది. ఇది స్వాభావికమైన అధిక ప్రవాహ సామర్థ్యం కలిగి తక్కువ నిర్వహణ ఖర్చులతో నిర్మించబడినది. దీని నిర్మాణానికి అదనంగా ఫ్లైఓవర్ యొక్క సబ్‌స్ట్రక్చర్, పిఎస్ సీ గిర్డర్‌లు మరియు స్లాబ్‌లకు హై గ్రేడ్ కాంక్రీట్ మరియు స్ట్రక్చరల్ స్టీల్‌ను ఉపయోగించారు. ఈ సింగిల్ లైన్ వంతెన రెండు దిశలలో రైళ్ల కదలిక కోసం పొందించబడింది 32.5 టన్నుల యాక్సిల్ లోడ్‌తో రైళ్లను సజావుగా నడిపేందుకు ఉపయోగపడుతుంది .గ్రాండ్ ట్రంక్ రూట్‌లో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్, ఇది దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేల మధ్య వివిధ రైళ్ల రాకపోకలకు ఇంటర్‌చేంజ్ పాయింట్. నిరంతరం రైళ్ల రాక పోకలతో రద్దీగా ఉన్న ఈ విభాగంలో రైళ్ల కదలికలను సులభతరం చేయడానికి ఈ కొత్త రైలు ఫ్లైఓవర్ సహాయపడుతుంది.

ఈ ఫ్లైఓవర్ ప్రారంభించడం వల్ల గూడూరు స్టేషన్ మీదుగా విజయవాడ నుండి రేణిగుంట మరియు చెన్నై నుండి విజయవాడ మధ్య ఏకకాలంలో నడిచే రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్ ఫ్లైఓవర్‌ను నిర్మిoచినందుకు దక్షిణ మధ్య రైల్వే మరియు ఆర్ వీఎన్ఎల్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. గూడూరు స్టేషన్‌ ప్రధాన జంక్షన్‌గా మరియు రైళ్ల రాకపోకల సంఖ్య ఎక్కువగా ఉండటం తోపాటు ఇంటర్‌చేంజ్ పాయింట్ కావడంతో ఈ రకమైన రైలు వంతెన ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. రద్దీగా ఉండే గూడూరు స్టేషన్ వద్ద రైళ్లు వేచి ఉండే సమయాన్ని ఎంతగానో తగ్గించడంలో ఇది సహాయపడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement