Wednesday, May 15, 2024

బిసిల‌ను అంద‌లం ఎక్కించిన ఘ‌న‌త‌ జ‌గ‌న్ దే – మేయ‌ర్ రామ‌య్య‌..

కర్నూలు – టిడిపి హయాంలో బీసీలకు మేలు చేశామంటూ నారా లోకేష్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మేయర్ బి వై రామయ్య మండిపడ్డారు. అసలు బీసీలకు ఏమి చేశారో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు లో శుక్రవారం పార్టీ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు టీడీపీ అన్యాయం చేసినందుకే ప్రజలు ఆ పార్టీనీ చావు దెబ్బతీశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీ లకు పనికిరాని పనిముట్లు ఇచ్చారన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక బీసీ ల కోసం రూ.10.60 వేల కోట్ల ను ఖర్చు చేశామన్నారు.

నారా లోకేష్ కు లోకజ్ఞానం లేద‌ని, టిడిపి పార్టీ హయాంలో బిసిలకు ఏమి చేయకుండా పదే పదే అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అడ్డదారిలో మంత్రి అయిన నారా లోకేష్ కి ఏమి తెలియలేదని రామయ్య విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బిసిలకు పెద్ద పీట వేస్తోందన్నారు. కర్నూలు జిల్లాలో బిసిలకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవులను కల్పించామన్నారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు వాల్మీకులను మోసం చేశారని రామయ్య విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను 90 శాతం ప్రజలకు అమలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. బీసీ ల అభివృద్ధి పై ఎక్కడైనా తాము చర్చలకు సిద్దంగా వున్నామని రామయ్య స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement