Thursday, May 16, 2024

ప్రతి ఆర్జీకి గడువులోగా పరిష్కారం.. లేకుంటే అధికారులదే బాధ్యత..

కర్నూలు, ప్రభన్యూస్‌: స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి ఆర్జీని గడువులోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ కోటేశ్వరరావు, జెసి డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, జెసి రాంసుందర్‌రెడ్డి, జెసి నారపురెడ్డిమౌర్య, జెసి ఎంకెవి శ్రీనివాసులు, డీఆర్‌ఓ పుల్లయ్య, డీఎఫ్‌ఓ ప్రసున్న, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రమాదేవి, రాఘవేంద్ర తదితరులు జిల్లా నలుమూలల ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. చిరునవ్వుతో స్పందించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలుగజేయాలన్నారు. ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం రాకపోయినా, నిర్దేశించిన గడువులోగా ఇవ్వకపోయినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. స్పందనలో వచ్చిన దరఖాస్తులు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎ, రీ ఓపెన్‌ దరఖాస్తులు తదితర వివరాలపై జిల్లా కలెక్టర్‌ ఆరా తీశారు. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆర్జీల పరిష్కారంపై జిల్లా స్థాయి శాఖాధిపతులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి, గడువులోగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు నుంచి వచ్చిన కేసులు పైనల్‌ ఆర్డర్స్‌ అమలుచేయాలని, అవకాశం లేకుంటే అప్పీలుకు వెళ్లాలన్నారు. అలాగే పెండింగ్‌ కేసులు మధ్యంతర ఉత్తర్వులు వచ్చినట్లయితే ఆ ఉత్తర్వులు అమలు పరచాలని, లేనిచో స్టే ఆర్డర్‌ రద్దు పరచడానికి పిటిషిన్‌ దాఖలు చేయాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి సత్వరమే కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

స్పందన ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో వినతులు..

ఓర్వకల్‌ మండలం, కన్నమడకల గ్రామం చెందిన వెంకటస్వామి తమ గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉంది. అందులో 1.50 ఎకరాల భూమిని అమ్మడం జరిగిందని ఇంకా 50 సెంట్ల మిగులు భూమి ఉందని, ఆ భూమి ఆన్‌లైన్‌లో చూపించాలని వినతిపత్రం అందజేశారు. వెల్దుర్తి మండలం, బొమ్మిరెడ్డి పల్లికి చెందిన చింతామాని ఎల్లారాముడు తన తండ్రి ఆస్తిని బాగ పరిష్కారం చేసుకున్నామని పట్టాదార్‌ పాస్‌ పుస్తకం మంజూరు చేయాలని వారు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై బాధితులు వినతిప త్రాలు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement