Wednesday, May 1, 2024

CM KCR: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ బోధ‌న.. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అమలు

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌న‌ప‌ర్తి జిల్లా వేదిక‌గా మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా మ‌న ఊరు – మ‌న బ‌డి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ క‌లిసి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్ర‌సంగించారు. మ‌న ఊరు మ‌న‌బ‌డి కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వ విద్యారంగాన్ని ప‌టిష్టం చేయ‌నుందని తెలిపారు. దీనికి వ‌న‌ప‌ర్తి జిల్లా వేదిక‌గా శ్రీకారం చుట్టామని, వ‌న‌ప‌ర్తికి ఆ గౌర‌వం ద‌క్కుతుందన్నారు. తామంతా కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుని పైకి వ‌చ్చిన వాళ్ల‌మే అని పేర్కొన్నారు. మీ ముందు ఈ హోదాలో నిల‌బ‌డ్డామంటే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆ రోజు గురువులు చెప్పిన విద్య‌నే కార‌ణం అని అన్నారు. భ‌విష్య‌త్‌లో చాలా చ‌క్క‌టి వ‌స‌తులు పాఠ‌శాల‌ల్లో నిర్మాణం కాబోతున్నాయని చెప్పారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి ఆంగ్ల బోధ‌న కూడా ప్రారంభం కాబోతుంద‌ని వెల్లడించారు. విద్యార్థులంద‌రూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement