Sunday, May 5, 2024

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం : కర్నూలు రేంజ్ డిఐజి

పోలీసుస్టేషన్ ను ఆశ్రయించే బాధితుల సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని కర్నూల్ రేంజ్ డిఐజి ఎస్.సెంథిల్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక డీఐజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల పై జరిగే నేరాలు, ఎస్సీ, ఎస్టీ నేరాలు, పోక్సో కేసుల పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. దిశా ఎస్ ఓ ఎస్ యాప్ ను ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలనీ సూచించారు. కర్నూలు రేంజ్ క్రింద గతంలో కర్నూలు, కడప రెండు జిల్లాలు మాత్రమే ఉండేవన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ ఎస్ ఓ ఎస్ ఎస్ యాప్ ను ప్రతి మహిళ ఇన్ స్టాలేషన్, రిజిస్ట్రేషన్ చేసుకునేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఎక్కడైనా అత్యవసర ఇబ్బందులు, వేధింపులకు గురైనప్పుడు దిశా ఎస్ ఓ ఎస్ యాప్ బటన్ నొక్కడం లేదా ఆ మొబైల్ ను పలు సార్లు కదలికలు చేయడంతో కంట్రోల్ రూమ్ పోలీసులకు సమాచారం వస్తుందన్నారు.

పోలీసు బృందాలు అక్కడి లోకేషన్ తెలుసుకుని వెళ్ళి బాధిత మహిళలను రక్షించడం జరుగుతుందన్నారు. మహిళల పై జరిగే నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు చేపడతామన్నారు. పోక్సో యాక్ట్ కేసుల్లో దర్యాప్తు చేయడమే మాత్రమే కాకుండా మానిటరింగ్ చేస్తూ కేసుల ట్రయల్ కూడా సరైన సమయంలో చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా పోలీసుస్టేషన్ ను ఆశ్రయించే ప్రతి బాధితుడి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. ఫారెస్ట్ ఏరియాల్లో నాటుసారాను అరికట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సెబ్ అధికారులు విస్తృతంగా దాడులు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్నారన్నారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ, కర్ణాటక బార్డర్ ప్రాంతాల నుండి మద్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. పోలీసు అధికారులు అందరూ బాగా పని చేస్తున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన నంద్యాల, అన్నమయ్య జిల్లాలో అన్ని మౌలిక సదుపాయల నిర్మాణాలను సిధ్దం చేసి ఉంచామన్నారు. పోలీసు మ్యాన్ పవర్ ను పెంచి, సజావుగా జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రజలు, మీడియా కూడా పోలీసుశాఖకు తమ వంతుగా సహాకరించాలన్నారు. సమావేశంలో జిలా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement