Tuesday, May 7, 2024

కృష్ణా జ‌లాల‌కు క‌ర్నాట‌క ఎస‌రు..

అమరావతి, ఆంధ్రప్రభ: కృష్ణా జలాలను తరలించేందుకు తుంగభద్ర డ్యాంకు ఎగువన ”నవలి” రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టేందుకు కర్ణాటక సిద్ధమవుతోంది. తుంగభద్రలో భాగస్వామ్య రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలు ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తుండగా కర్ణాటక మాత్రం అనుమతుల కోసం డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేది)ను తుంగభద్ర బోర్డు ముందుంచింది. ఇటీవల తుంగభద్ర బోర్డు చైర్మన్‌ రాయ్‌ పురే అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనూ, గత ఏడాది బెంగళూరు భేటీ-లోనూ ఏపీ అధికారులు తమ వాదనను బలంగా వినిపించారు. కర్ణాటక మాత్రం తుంగభద్ర పూడిక వల్ల కోల్పోతున్న నీటిని వినియోగించుకునేందుకు కొప్పళ జిల్లా నవలి వద్ద 52 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే రిజర్వాయర్‌ నిర్మాణానికి అనుమతులివ్వాలనీ, దీని వల్ల తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని చెబుతోంది. 230 టీ-ఎంసీల తుంగభద్ర జలాల్లో బచావల్‌ -టైబ్యునల్‌ ద్వారా తమ వాటాగా దక్కిన 151.49 టీ-ఎంసీలను సద్వినియోగం చేసుకునేందుకు రిజర్వాయర్‌ నిర్మిస్తున్నట్టు- కర్ణాటక చెబుతోంది.

తుంగభద్రలో పూడిక వల్ల నీరు వృధా అవుతోందనీ, కేటాయింపుల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకోలేక పోతున్నామని ఆ రాష్ట్ర నీటిపారుదల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ వాదనను ఎప్పటి నుంచో తోసిపుచ్చుతున్న ఏపీ తుంగభద్ర బోర్డుకు విస్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించింది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తుంగభద్రకు ఎగువన తుంగ, భద్ర డ్యామ్‌, సింగటలూరు బ్యారేజ్‌, సింగటలూరు ఎత్తపోతల పథకాలను నిర్మించి కేటాయింపుల కన్నా అధికంగానే నీటిని తరిస్తోంది.. ఇపుడు కొత్తగా నవలి రిజర్వాయర్‌ నిర్మిస్తే కృష్ణా దిగువన ఉన్న తమ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు దెబ్బతింటాయి.. తుంగభద్ర డ్యాంలో నీటి సామర్థ్యంపై 2008లో చేసిన టోపోగ్రాఫిక్‌ సర్వేకూ, 2016లో చేసిన సర్వేకు నాలుగు టీ-ఎంసీల తేడా వచ్చింది..
తుంగభద్ర డ్యాం నుంచి కర్ణాటక భారీగానే నీటిని తరలిస్తున్నట్టు- ఆధారాలు కనబడుతున్నాయి..

ఈ నేపథ్యంలో తుంగభద్ర సామర్థ్యం, కేటాయింపులు, వినియోగంపై సాంకేతికంగా నిర్దిష్టమైన గణాంకాలను వెల్లడించాలని బోర్డును ఏపీ కోరుతోంది. 133 టీ-ఎంసీల సామర్థ్యంతో 1953లో నిర్మించిన తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత 105.78 టీ-ఎంసీలకు తగ్గుముఖం పట్టినట్టు- టోపోగ్రాఫిక్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎగువ నుంచి వచ్చే వరద జలాలను కూడా కలుపుకుని డ్యాంలో 75శాతం నీటి లభ్యత ఆధారంగా 230 టీ-ఎంసీలు అందుబాటు-లోకి వస్తాయని బావించి తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది. కర్ణాటకకు 151.49, ఏపీకి 72, తెలంగాణకు 6.51 టీఎంసీలను కేటాయించింది. పూడిక వల్ల కోల్పోతున్న నీటిని మినహాయించి అందుబాటు-లో ఉన్న జలాలను దామాషా ప్రకారం ప్రతి ఏడాది తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకు కేటాయిస్తోంది. కేటాయింపులను పట్టించుకోకుండా ఎగువ ప్రాజెక్టుల ద్వారా కర్ణాటక నీటిని తోడేస్తుంది. ఈ నేపథ్యంలో తుంగభద్రలో నీటి లెక్కలను తేల్చాకే నవలి రిజర్వాయర్‌ గురించి సమగ్రంగా చర్చించాలన్న ఏపీ వాదనకు తుంగభద్ర బోర్డు కూడా సానుకూలత వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement