Saturday, April 27, 2024

కోనసీమ క్రాప్‌ హాలీడే పాపం వైసీపీదే! రైతులకు అండగా జనసేన: పవన్‌ కల్యాణ్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేసిన తప్పిదాల వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈరోజు క్రాప్‌ హాలీడే ప్రకటించే పరిస్థితి దాపురించిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని, కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులు, పూడికతీత, గట్లు- పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదని ఈ రోజు (శుక్రవారం) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరని, ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుందన్నారు. దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరమన్నారు. తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారని వివరించారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైన ఉంటాయి. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని, క్రాప్‌ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుందని, 2011లో ఒకసారి దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారని, ఆనాడు గోదావరి జిల్లాల రైతుల నిర్ణయం దేశాన్ని కుదిపేసిందని గుర్తు చేశారు. దాదాపు 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు తరలివచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారని, మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడని కొన్ని మార్గనిర్దేశకాలు చేశారని పేర్కొన్నారు.

ఇప్పుడు 11 ఏళ్లు తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితే దాపురించిందని, అల్లవరం, ఐ. పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 25 వేల ఎకరాలు, అలాగే అమలాపురం రూరల్‌, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో కూడా కొన్ని వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారని, దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పంట విరామం ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భయపడి రాత్రికి రాత్రి డబ్బులు వేశారు..

కోనసీమ రైతాంగం క్రాప్‌ హాలీడే ప్రకటించడానికి వైసీపీ చేసిన తప్పులే కారణమని పవన్‌ స్పష్టం చేశారు. రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని, దాదాపు రూ. 475 కోట్లు బకాయిలు ఉన్నాయని, రైతులు పంట విరామం ప్రకటించడంతో రాత్రికి రాత్రి వారి ఖాతాల్లో రూ. 139 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. క్రాప్‌ హాలీడే ప్రకటించిన మండలాల్లో సాగునీరు అందటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. తొలకరి పంటకు భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా ధాన్యం రంగు మారితే ప్రభుత్వం ధర ఇవ్వడం లేదని తెలిపారు. రైతుల నుంచి వినిపిస్తోన్న ప్రధాన డిమాండ్‌ కూలీ రేట్లు బాగా పెరిగిపోయాయని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్న డిమాండ్‌ ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఎందుకో కార్యరూపం దాల్చలేదన్నారు. కేవలం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్య ధోరణితోనే ఈ రోజు కోనసీమ రైతాంగానికి ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యోగులు రోడ్డెక్కితే బాధ్యత లేదని కామెంట్లు- చేశారని, ఇలా ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడటం తప్ప.. పరిష్కరించే మనస్తత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట విరామం ప్రకటించిన రైతాంగంపై వైసీపీ నాయకులు రాజకీయ కోణంలో విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రైతు సోదరులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement