Thursday, May 9, 2024

కుటుంబ సభ్యులే చంపేశారు..!

సుండుపల్లె : మహిళను తమ కుటుంబ సభ్యులే ఏడాది క్రితం చంపేసి గుట్టుచప్పుడు కాకుండా తమ వ్యవసాయ పొలం సమీపంలో పాతేసిన సంఘటన అన్నమయ్య జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు దృష్టి సారించడంతో సుండుపల్లె మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే సుండుపల్లె మండలం మడితాడు పంచాయతి వానరాచపల్లెకు చెందిన బానే వెంకటరమణ సమీపంలోని ఉప్పరపల్లెకు చెందిన అక్కా చెల్లెళ్లను పెళ్లిచేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య ఇటీవల కాలంలో సయోధ్య కుదరలేదు. వెంకటరమణ పెద్ద భార్య క్రిష్ణమ్మ ఆమె చెల్లెలు శాంతమ్మ ఇద్దరు ఇంట్లో అప్పుడప్పుడు గొడవపడే వారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మే చివరలో అక్కచెల్లెళ్ల మధ్య ఏర్పడిన తగవు చివరకు క్రిష్ణమ్మ మృతికి కారణమైనది. అదే సమయంలో క్రిష్ణమ్మ (58)ను భర్త వెంకటరమణ, కుమారులు, చెల్లెలు చెంపేసి తమ వ్యవసాయ పొలం సమీపంలోని ఈడీగోని కుంట కట్ట ప్రక్కన ఉన్న చిన్న నీటి గుంత వద్ద పాతేశారు. అయితే మృతురాలు క్రిష్ణమ్మ అక్క సరస్వతమ్మ, సోదరుడు బాలక్రిష్ణ లు అప్పటి నుంచి భర్త కుమారులపై అనుమానం వ్యక్తం చేస్తూ సుండుపల్లె పోలీసులకు పలుమార్లు పిర్యాదులు చేశారు. అయితే పోలీసులు కేసును ఛేదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మృతురాలు క్రిష్ణమ్మ అక్క సరస్వతమ్మ, తమ్ముడు బాలక్రిష్ణ పట్టు విడవని విక్రమార్కుల వలె వారం రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేస్తూ తమ ఆవేదన వెళ్లబుచుకున్నారు. దీంతో ఎస్పీ ఈ కేసును ఛేదించాలని కింది స్థాయి పోలీసులను ఆదేశించారు. వెంటనే రాయచోటి రూరల్ సిఐ లింగప్ప, సుండుపల్లె ఎస్సై నరసింహుడులు ఫిర్యాదు ఆధారంగా శైలిలో అనుమానితులను విచారించగా నిందితులు తమ క్రూర చర్యను ఒప్పుకున్నారు. దీంతో సిఐ లింగప్ప ఆధ్వర్యంలో మంగళవారం క్రిష్ణమ్మ మృతదేహాన్ని వెలికి తీసి అక్కడే తహసీల్దార్ జీవన్ చంద్రశేఖర్ ఎదుట పంచనామా నిర్వహించి కడప రిమ్స్ వైద్యులు డాక్టర్ సుధాకర్ చే పోస్ట్ మార్టం పూర్తి చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement