Saturday, April 27, 2024

AP | చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం.. నంద్యాల సభలో జగన్ !

నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం… అని అన్నారు. చంద్రబాబు అంటే కరువు గుర్తుకొస్తుంది. కరెంట్ కోతలు గుర్తుకొస్తారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు. చంద్రబాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న వ్యాఖ్యలు గుర్తు కొస్తాయని ఎద్దేవా చేశారు. మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు. నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉందని… ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

తాను ఒంటరిగా ఎన్నికలు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ పొత్తుకు కాంగ్రెస్ కూడా తోడయ్యిందని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 2019లో ఇచ్చిన ఎన్నికల హామీలు 99 శాతం అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడి అందించాం. 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధం. ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లుకూడా ముందుకు తీసుకెళ్తాం. 2 లక్షల 77వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement