Tuesday, May 14, 2024

ఎపిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌త‌నం ప్రారంభ‌మైంది – చంద్ర‌బాబునాయ‌డు

అమరావతి : తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే వైసిపి ప్ర‌భుత్వం ప‌త‌నానికి నాంది అని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 20 నెలల వైసీపీ పాలనలో అన్నీ ఉల్లంఘనలేనని ఆయన ఆరోపించారు. అమరావతిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్‌ పార్టీ నేతలు రాజ్యాంగ వ్యవస్థలన్నీంటిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పెట్టుబడులను ధ్వంసం చేశారు. ప్రభుత్వ విద్వేషాల కారణంగా రైతులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతల దుర్మార్గాలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. టీడీపీ నాయకులను ఎంత హింసపెట్టినా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని అభినందించారు. ఎన్నికల్లో టీడీపీకి 38.74 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. 94 శాతం పంచాయతీలను గెలిచామని వైసీపీ గాలిమాటలు చెబుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రజల గుండెల్లో ఉందని, అరాచకాలు చేసేవారు ఎన్నికల ఫలితాలు చూసైనా మారాలని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని అచ్చెన్నాయుడిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఏది మాట్లాడినా పట్టించుకోరా.? అని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేద‌ని,.. అందరికీ గుణపాఠం చెబుతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదు అని అన్నారు. ఎస్‌ఈసీ చెబితే వినొద్దని మంత్రి పెద్దిరెడ్డి చెబుతారా.? అని ప్రశ్నించారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని చెప్పారు. గెలిచిన పంచాయతీల్లో చాలాచోట్ల ఫలితం తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. గెలుపోటములు సహజమని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారని చంద్రబాబు అన్నారు. ఎన్నికలను మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని రణరంగంగా మార్చారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement