Tuesday, May 7, 2024

ఫైన‌ల్ స్టేజ్‌లో కొత్త జిల్లాల ఇష్యూ.. ఇవ్వాలో, రేపో నోటిఫికేష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొత్త జిల్లాల ఏర్పాటు ఇష్యూ ఫైనల్‌ స్టేజీకి చేరింది. ఇవ్వాలో.. రేపో నోటిఫికేష‌న్‌ ఇచ్చేందుకు యంత్రాంగం రెడీ అవుతోంది. ఇప్పటి దాకా వచ్చిన 11వేలకు పైగా అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకొన్న సర్కార్‌.. మరిన్ని కొత్త రెవెన్యూ డివిజన్స్‌ను పెంచే చాన్స్‌ కనిపిస్తోంది. కొన్ని జిల్లాల పేర్ల మార్పుతో పాటు కొత్తగా రెవెన్యూ డివిజ‌న్ల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పు, కొన్ని మండ‌లాల‌ను వేరే జిల్లాల్లో కొన‌సాగించ‌డం వంటి డిమాండ్లు ప్రభుత్వానికి చేరిన‌ట్టు తెలుస్తోంది. వాటన్నింటిపై ప్రణాళిక శాఖ అధికారుల‌తో పాటు రాష్ట్ర క‌మిటీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రిపోర్ట్‌ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ఉన్న ప‌రిస్థితులపై సీఎం అధికారుల‌తో రివ్యూ చేశారు. ప్రజాభీష్టం మేర‌కే ముందుకెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్టు తెలిసింది. కొన్నింటికి కొత్త పేర్లు పెట్టాలని డిమాండ్స్‌ వచ్చినా ఎలాంటి మార్పు ఉండబోద‌ని తెలుస్తోంది. ఇక బాలాజీ జిల్లాకు బ‌దులు తిరుప‌తి పేరుతోనే కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు స‌మాచారం.

జిల్లా కేంద్రాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండ‌బోద‌ని కొంత‌మంది అధికారులు అంటున్నారు. రెవెన్యూ డివిజ‌న్ల‌పై పెద్ద ఎత్తున డిమాండ్లు వ‌స్తున్నాయి. దీంతో గతంలో ప్రకటించిన 11 కాకుండా మరో 4 కొత్త డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొత్త ఆఫీసుల‌ ఎంపిక, ఏర్పాటు కూడా పూర్తయింది. ఇక సాధ్యమైనంత వరకు ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ భ‌వ‌నాలు అందుబాటులో లేనిచోట్ల అద్దె భ‌వ‌నాల్లో తాత్కాలిక ఆఫీస్‌లు ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల పంపిణీ కూడా దాదాపు పూర్తయింది. ఇవాళ సీఎం జ‌గ‌న్ వ‌ద్ద కొత్త జిల్లాల‌పై తుది స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశం త‌ర్వాత ఫైన‌ల్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల కానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement