Friday, May 3, 2024

ఎపిలో రేప‌టి నుంచి బ‌డులు బంద్ – టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు య‌థాత‌థం…

అమ‌రావ‌తి – రాష్ట్రంలో ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయని మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ వెల్లడించారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం వైయ‌స్ జగన్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 24కి పూర్తవుతున్నాయని, ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం పూర్తయిందని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటివరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పూర్తిస్థాయిలో పాటిస్తూనే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుపుతామని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement