Tuesday, April 30, 2024

ఆరోగ్య‌శ్రీ కి నో బెడ్స్ – ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ ఘ‌రానా దోపిడి..

క్యాష్‌ పే అంటేనే రూమ్స్‌
బిల్లు చెల్లించే వారికే ఆక్సిజన్‌
డబ్బు కట్టలేమంటే నో స్టాక్
అడిగినంత అడ్వాన్స్‌ కడితే క్షణాల్లో అత్యవసర బెడ్లు సిద్ధం
ప్రయివేటు వైద్యశాలల్లో మొదలైన దందా
కరోనా పేరుతో నిలువు దోపిడీ

అమరావతి, : కరోనా వంటి విపత ్కర పరిస్థి తుల్లో పేదవారికి సైతం కార్పొరేట్‌ వైద్యశాలల్లో మెరుగైన చికిత్సను అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ క్రిందకు తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ లబ్దిదారులు ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ప్రైవేట్‌ కోవిడ్‌ వైద్యశాలల్లో కార్పొరేట్‌ వైద్యసేవలు పొందే వెసులుబాటును కూడా కల్పించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉదృతమవుతున్న నేపథ్యంలో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అంటేనే.. బెడ్లు ఖాళీ లేవని చెబుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఆరోగ్యశ్రీ లబ్దిదారుడికి అవే ఆసుపత్రుల్లో నో బెడ్స్‌ అని సమాధానం చెబుతున్న వైద్య సిబ్బంది క్యాష్‌ పే అంటే క్షణాల్లో రూమ్‌ రెడీ చేసి రాచమర్యాదలతో బాధితులకు వైద్యసేవలు అందిస్తు న్నారు. అవసరమైతే వారికి అత్యవసర చికిత్సలు కూడా చేస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ అదే ముసుగులో లక్షలు గుంజేస్తున్నారు. కరోనా చికిత్స అంటేనే ఖరీదుతో కూడుకున్న వైద్యం కావడం పేదలకు అంత ఆర్థిక స్తోమత లేక పోవడం, గత ఏడాది కరోనా సమయంలో ఎక్కువ మంది నిరుపేదలే ఇబ్బందు లకు గురికావడంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీ క్రింద చేర్చింది. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారుడికి ఖచ్చితంగా కరోనా వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంది. దీంతో ఎక్కడ తమ ఆదాయం తగ్గి దోపిడీ బండారం బయటపడుతుందేమోనన్న ముందుచూపుతో పలు కార్పొరేట్‌ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ అంటేనే చులకనగా చూస్తున్నారు. దీంతో కరోనా సోకిన అనేక మంది నిరుపేదలు బిల్లు చెల్లించి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఆపదలో ఆదుకుంటుందనుకున్న ఆరోగ్యశ్రీ అక్కరకు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది పేదలు కరోనా వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని కార్పొరేట్‌ వైద్యశాలల్లో సిబ్బంది తీరుతో కొంతమంది నిరుపేదలు ప్రత్యక్ష నరకాన్ని కూడా చూస్తున్నారు. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ తరహా దందా అధికంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ ఆశయానికి గండి పడడంతో పాటు ఆశయం కూడా పక్కదారి పడుతోంది.
క్యాష్‌ పే అంటేనే.. రూమ్స్‌ రెడీ
నెల్లూరు జిల్లాలోని రూరల్‌ గ్రామానికి చెందిన ఓ నిరుపేదకు కరోనా సోకింది. అయితే ప్రభుత్వ వైద్యశాలలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో ఆ నిరుపేద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్‌ వైద్యశాలకు వెళ్లారు. అప్పటికే కరోనా ప్రమాద స్థాయికి చేరడం, ఆసుపత్రికి వెళ్లడానికే అనేక ఇబ్బందులు పడ్డ ఆ నిరుపేద కరోనా బాధితుడికి అక్కడ కూడా నిరాశే మిగిలింది. కరోనా వైద్యం కోసం కార్పొరేట్‌ ఆసుపత్రుల గుమ్మం ముందు నిలబడ్డ ఆ బాధితుడి చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు చూడగానే.. సిబ్బంది ఇక్కడ బెడ్లు ఖాళీలేవంటూ దురుసుగా సమాధానం చెప్పారు. ఊపిరాడడం లేదు.. ప్రాణాలు పోతున్నాయి అని ప్రాధేయపడ్డా ఇక్కడ అసలు ఖాళీలే లేవంటూ బయటకు గెంటేశారు. అయితే అదే సమయంలో మరో రోగి ఆసుపత్రికి వచ్చి బెడ్‌ కావాలనగానే రూ. 3 లక్షలు డిపాజిట్‌ కట్టమన్నారు. క్షణాల్లో ఆ రోగికి సంబంధించిన బంధువులు అడ్వాన్స్‌ కట్టేశారు. అందుకు సంబంధించిన రశీదు తీసుకొచ్చేలోపే బాధితుడిని కరోనా వార్డుకు తరలించి ఐదు పది నిమిషాల్లోపే మెరుగైన వైద్యానికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసేశారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సంఘటనలు రోజూ అనేక జిల్లాలలో జరుగుతూనే ఉన్నాయి.. వందల సంఖ్యలో నిరుపేదలు ఆరోగ్యశ్రీ కార్డు చేతపట్టుకుని కరోనా వైద్యం కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు.
బిల్లు చెల్లించే వారికే ఆక్సిజన్‌
రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను సిద్దం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైద్యశాలలతో పాటు ప్రతి జిల్లాలోను 10 నుంచి 15 ప్రైవేట్‌ వైద్యశాలలను కోవిడ్‌ ఆసుపత్రుల క్రింద తీసుకున్నాయి. వాటి పరిధిలో 20 నుంచి 30 శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన బెడ్లు, వార్డులలో ప్రభుత్వం సూచించిన ఫీజుల మేరకే వసూలు చేయాలి. ఆ దిశగానే అన్నీరకాల కరోనా సేవలను అందించాలి. అయితే అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్రం లోని వివిధ కార్పొరేట్‌ వైద్యశాలల్లో బిల్లులు భారీగా చెల్లించిన వారికే మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నా రు. ఉదాహరణకు కరోనాతో ఓ బాధితుడు వైద్యశాలలో చేరితే రోజుకు 50 వేల నుంచి రూ. 1 లక్ష చెల్లించే వారికి ఓ రకంగాను.. 10 వేల నుంచి రూ. 50 వేలు చెల్లించే వారికి మరో రకంగాను వైద్యసేవలను అందిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల సిఫారసులతో వైద్యశాలలో చేరిన వారికి ప్రభుత్వం సూచించిన 5 వేల నుంచి రూ. 10 వేల వరకు మాత్రమే బిల్లులు వసూలు చేస్తూ అటువంటి వారి విషయంలో నిర్లక్ష్యంగా వైద్యాన్ని అందిస్తున్నారు. వారు అడిగినంత నగదు చెల్లించే వారికి మాత్రమే మంచి వైద్యాన్ని అవసరమైతే ఆక్సిజన్‌ అందిస్తున్నారు. వారు అడిగినంత డబ్బు చెల్లించుకోలేని వారికి అత్యవసర మైనా కూడా ఆక్సిజన్‌ అందించడం లేదు. అదేమని ప్రశ్నిస్తే నో స్టాక్‌ అని సమాధానం చెబుతూ తమ దందాను సమర్థించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement