Tuesday, May 7, 2024

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు, 8 లక్షల ఎకరాలకు సాగునీరు.. త్వరలోనే టెడర్లు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ఉత్తరాంద్రలో బీడు భూములను సాగుయోగ్యంగా మార్చే పథకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సుమారు 63.20 టీఎంసీల గోదావరి నికర జలాలను మళ్ళించటం ద్వారా ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని సుమారు 8 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.17,050.20 కోట్లు.. తొలి దశ అంచనా వ్యయాన్ని రూ.2,022.20 కోట్లుగా, రెండో దశ అంచనా వ్యయాన్ని రూ.15,028 కోట్లుగా విభజించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీటి వసతి కల్పించటంతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా తీరుతాయని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులు జారీ చేయటంతో అతి త్వరలో టెండర్లకు ఆహ్వానం పలకనున్నారు. గోదావరి జిలాలను పోలవరం ఎడమ కాలువ లోని 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి ఉత్తరాంధ్రకు రోజుకు 1.51 టీఎంసీలను తరలించేలా జలనవరుల శాఖ డీపీఆర్‌ రూపొందించింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సుమారు 3 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్నాన్నాయి. సముద్రం వెళుతున్న నీటిని పోలవరం ఎడమ కాల్వలో 162.409 కిలోమీటర్ల నుంచి తరలించనున్నారు. రోజుకు సుమారు 8 వేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల పాటు సుమారు 63 టీఎంలసీలను తరలించేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరిలోని నికర జలాలను ఉత్తరాంద్ర జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు 63.99 కిలో మీటర్ల పొడవున ప్రధాన కాలువను నిర్మించనున్నారు.

ఈ కాలువ పనులను గతంలోనే చేపట్టినా పూర్తి చేయలేదు. 63.99 కిలో మీటర్లలో మిగిలిపోయిన 37.585 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. కాలువతో పాటు తాటిపూడి రిజర్వాయర్‌, వీరనారాయణపురం రిజర్వాయర్‌, భూదేవి రిజర్వాయర్‌, సబ్‌ లిప్ట్‌, డిస్ట్రిబ్య్రూటరీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తొలి దశలో 13.5 కిలోమీటర్ల పొడవున లీడింగ్‌ కెనాల్‌ తో పటు 3.15 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్‌ ను నిర్మించనున్నారు. రెండో దశలో 63.995 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, పాపయ్యపాలెం లిప్ట్‌ తో పాటు 20.05 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్‌ ను నిర్మించనున్నారు. 2009 లోనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అప్పటి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా 13 సంవత్సరాల తరువాత పరిపాలనా అనుమతులు రావటం, -టె-ండర్లకు రంగం సిద్ధమవటంతో ఉత్తరాంద్రలోని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement