Thursday, April 25, 2024

జాబ్‌ క్యాలెండర్‌లో మిగిలిన 8వేలకుపైగా పోస్టులు సత్వరమే భర్తీ : వైఎస్‌ జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 2021- 22 జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన వివిధ శాఖల పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్‌, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్‌ చేసిన పోస్టుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్‌లాక్‌ పోస్టులు, ఏపీపీఎస్‌సీ, వైద్య, ఆరోగ్య- కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌ను సమగ్రంగా సమీక్షించారు. 2021-22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేసినట్టుగా వెల్లడించిన అధికారులు ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేసినట్లు వివరించారు. గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ఈ ఒక్క ఏడాదిలో పూర్తయ్యాయని, 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉందని తెలిపారు. భర్తీచేయాల్సిన పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షలమందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇచ్చామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మరో 50వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని, ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందని తెలిపారు.

జాబ్‌ క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని, నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీచేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యా, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామని, అలాంటప్పుడు ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదు, భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవని పేర్కొన్నారు. ఉన్నతవిద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీటవేసేలా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. రెగ్యులర్‌పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియమకాలు జరగాలన్న సీఎం జగన్‌ దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీసు ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్‌ప్లాన్‌ రూపొందించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని, వచ్చే నెల మొదటివారంలో తనకు నివేదించాలని, కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె. హేమచంద్రారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్త, జీఏడీ కార్యదర్శి(సర్వీసులు, హెచ్‌ఆర్‌ఎం) హెచ్‌. అరుణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement