Thursday, May 9, 2024

Tirumala | సామాన్య భక్తుల కోసం.. ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు

తిరుమల, ప్రభన్యూస్‌ : కోవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచివుండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్‌ 30 వ తేది వరకు స్వామివారి సేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు టిటిడి చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేయడం జరిగింది. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది. కాగా గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదు. కేవలం స్వయంగా వచ్చే విఐపిలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పించడం జరుగుతుంది.

తద్వారా ప్రతిరోజూ మూడు గంటల సమయం ఆదా అవుతుందని తెలిపారు. క్యూ లైన్‌లో గంటల తరబడి కిలోమీటర్లమేర వేచివుండే వేలాదిమంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం అవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, విఐపిలు సహకరించాలని చైర్మెన్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement