Monday, April 29, 2024

Fire Accident – బూడిద కుప్పగా సాహితీ ఫార్మా.. ఇద్దరి దుర్మరణం..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సాహితీ ఫార్మాలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మంత్రి అమర్నాథ్ తెలిపారు.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడానికి, ఎక్కడికైనా తీసుకువెళ్లాడనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. . మంత్రి అమర్నాథ్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసిందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తామని తెలిపారు. తాను ప్రమాద స్థలానికి వెళ్లి, అధికారులతో రివ్యూ ఏర్పాటు చేస్తున్నానని అన్నారు

సాల్వెంట్ రికవరీ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన స్పష్టతనిచ్చారు. ప్రమాదం సమయంలో 35 మంది కార్మికులు పని చేస్తున్నారని.. ఏడుగురికి గాయాలు అయ్యాయని తెలిపారు. అయితే.. మార్గమధ్యంలో ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మరణించారని చెప్పారు. మిగిలిన బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని.. ఆ బాధితులందరూ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు.

కేజీహెచ్‌లో క్షతగాత్రులకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పిన మంత్రి అమర్నాథ్. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే.. వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ..ఇదిలావుండగా.. సాహితీ ఫార్మాలో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 10 ఫైర్ ఇంజన్లు, స్కై లిఫ్టర్ల సహాయంతో.. ఐదు గంటలకు పైగా శ్రమించి, బలగాలు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో.. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. కెమికల్స్‌ని అన్‌లోడ్ చేస్తున్న సమయంలో.. రసాయనాలు ఒత్తిడికి గురయ్యాయని, ఈ క్రమంలోనే కంటైనర్‌కి నిప్పు అంటుకోవడంతో, నిమిషాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయని తెలిసింది. ఈ మంటల్లో సాహితీ ఫార్మా యూనిట్-1 మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది

Advertisement

తాజా వార్తలు

Advertisement