Sunday, April 28, 2024

తండ్రిని చంపిన తనయునికి యావజ్జీవ కారాగార శిక్ష


మద్యం మత్తులో కన్న తండ్రినే కత్తితో నరికి చంపిన కుమారునికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తిరుపతి థర్డ్‌ ఏడీజే కోర్టు జడ్జి గురువారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కన్నికాపురం ఎస్టీకాలనీకి చెందిన సుబ్రమణ్యం(57) కుమారుడు సురేష్‌ (25) జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. గత ఏడాది మే నెల 10వ తేదీన కేజీ కుప్పం గ్రామ శివారుల్లోని వెంకటేశ్‌ చౌదరి పొలంలో మేకలు మేపుతున్న సుబ్రమణ్యం వద్దకు వచ్చిన సురేష్‌ మద్యంకు డబ్బులు ఇవ్వమని గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కత్తితో తండ్రి తలపై నరికి చంపి పరారయ్యాడు. సుబ్రమణ్యం భార్య కన్నెమ్మ (54) పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలో పోలీసులు నాగరాజు, భాస్కరయ్య, భాస్కర్, ఏలుమలైరెడ్డి, గవాస్కర్‌ గాలింపు చేపట్టి చాకచక్యంగా అతన్ని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. తిరుపతి థర్డ్‌ ఏడీజే కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెంకటనారాయణ కోర్టులో ఈ కేసును వాదించారు. కేసును పూర్తిస్థాయిలో పరిశీలించిన జడ్జి ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement