Saturday, May 4, 2024

తాడిప‌త్రిలో విషాదం – ముందు భార్య‌, ఆ త‌ర్వాత భ‌ర్త … రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య ..

తాడిపత్రి: రైలు కిందపడి యువ దంపతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం భార్య రైలు కిందపడగా.. మంగళవారం ఉదయం భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రైల్వే పోలీసులు, మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడకు చెందిన మంజునాథ్‌ (26), పొట్లూరి మండలం గరుగు చింతలపల్లి గ్రామానికి చెందిన రమాదేవి (24) ప్రేమించుకున్నారు. 6 నెలల క్రితం పెద్దలను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం తాడిపత్రి సమీపంలోని తెల్లవారిపల్లి వద్ద రమాదేవి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తాడిపత్రిలో రైలు కిందపడి మంజునాథ్‌ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఏ కారణంతో ఇలా తనువు చాలించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు సీఐ నాగప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement