Sunday, May 5, 2024

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. క్షేమంగా ఏపీకి తీసుకురావాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ..

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏపీకి చెందిన చాలా మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతే ధ్యేయంగా సీఎం జగన్ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ ప్రభుత్వ సంస్థ APNRTS పనిచేస్తోంది. కొన్నిరోజులుగా ఉక్రెయిన్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో భారతీయులు స్వదేశం రావాలని కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఈ సందర్భంలో రాష్ట్ర సీఎం జగన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డా. జై శంకర్ కి  లేఖ రాశారు. ఉక్రెయిన్ నుండి భారతదేశానికి చెందిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులను అప్రమత్తం చేసింది.

మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో నాలుగు వారాలుగా ఏపీఎన్ఆర్టీ సొసైటీ పలు చర్యలు తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు వారి గురించి తెలుసుకునేందుకు ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయానికి APNRTS అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి జనవరి 30న ఇ మెయిల్ పంపారు. ఈ ఇ మెయిల్ లో అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగుల జాబితా పంపమని, అలాగే  భారతదేశానికి తిరిగి వెళ్లడానికి సుముఖంగా ఉన్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగుల సమాచారాన్ని అందించమని  అభ్యర్థించారు. ఉక్రెయిన్ నుండి స్వదేశానికి రావాలనుకునే ప్రవాసాంధ్రులకు సహాయం చేయడానికి APNRTS అవసరమైన చర్యలు తీసుకుంది.

ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అంతేకాకుండా APNRTS  వెబ్‌సైట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్‌లు 0863 234 0678, వాట్సాప్ నంబరు: 85000 27678 అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థుల కోసం రిజిస్ట్రేషన్ ఫారమ్‌ల హైపర్‌ లింక్‌లు, MEA యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌లు మరియు భారతీయ-ఉక్రెయిన్ కంట్రోల్ రూమ్ నంబర్‌లు APNRTS వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా గ్రూప్‌లలో పోస్ట్ చేయడం జరిగింది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు MEA హెల్ప్‌లైన్‌ మరియు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి సమాచారం తెలుసుకుని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతోంది. స్వదేశానికి రప్పించే ప్రక్రియలో అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి APNRT సొసైటీ  ఎల్లవేళలా  అందుబాటులో ఉంటుంది. ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసివ్ చేసుకుని అక్కడి పరిస్థితులను తెలియజేస్తోంది. APNRT సొసైటీ విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ….వారిని ఎంబసీ వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తోంది. 

కోవిడ్ సమయంలో ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి తిరిగొచ్చిన విద్యార్థుల ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొంత మంది విద్యార్థులను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం భారతీయులను స్వదేశానికి రప్పించే క్రమంలో, కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయము చేసుకొని ఏపీకి చెందిన వారిని క్షేమంగా రాష్ట్రానికి తరలించాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement