Wednesday, May 1, 2024

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు.. వారంరోజుల్లో లే అవుట్లలో పనులు..

పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి అవసరమైన నీళ్లు, కరెంటు సౌకర్యాలు ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని తెలిపారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం(గృహనిర్మాణశాఖ)పై ముఖ్యమంత్రి  జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, టిడ్కో ఇళ్లపై సీఎం సమగ్ర సమీక్ష జరిపారు. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు.

కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్‌ పనులు అన్నిచోట్ల దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు. 3.03 లక్షల ఇళ్లు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో జులై 10 కల్లా మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఆప్షన్‌లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభంకాగానే మొదలుపెడతామని అధికారులు తెలిపారు. జూన్‌ 2022 నాటికల్లా మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు  శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఐఐటీలు ఇతర సంస్ధల సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. అలాగే లే అవుట్ల వద్ద నీటి సదుపాయం, తదితర మౌలిక వసతుల కల్పనపైనా సీఎం సమీక్షించారు. రూరల్, అర్బన్‌ కలిపి 9,024 లే అవుట్లలో తాగునీరు, కరెంటు సదుపాయాలపై సీఎం సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వారంరోజుల్లో అన్ని లే అవుట్లలో పనులు పూర్తికావాలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా ఛార్జీలు సహా  ఇతరత్రా రేట్లు అమాంతంగా పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.34వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల అని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలోకాని, దేశంలోకాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇలా ఖర్చు చేసిన దాఖలాలు లేవని చెప్పారు. ఇంత పెద్ద లక్ష్యాన్ని గతంలో ఎవరూ ఆలోచన చేయలేదన్న సీఎం..దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అవినీతికి తావుండకూడదని, నాణ్యతకు పెద్ద పీట వేయాలని స్పష్టం చేశారు. మనసా, వాచా, కర్మేణా ఈ పనుల పట్ల అధికారులు అంకితభావాన్ని ప్రదర్శించాలని తెలిపారు. అప్పుడే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతామని అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎవరూ చేయలేదన్నారు. దీన్ని నిజం చేయాలని తాను తపన పడుతున్నానని చెప్పారు. నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలన్నారు.

‘’నా కల మీ అందరి కల కావాలి. మనందరి కల పేదవాడి కల కావాలి. అప్పుడే ఈ కార్యక్రమం సాకారమవుతుంది. పేదవాడికి అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నది మన లక్ష్యం.
దేశం మొత్తం మనవైపు చూస్తోంది. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాదు, పేదవాళ్లకు మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలి. దీనికి పై స్థాయి నుంచి కిందిస్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలి. అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలి. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ఒక ప్రత్యేక నెంబరు ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ప్రతి లేఅవుట్‌లో ఒక బోర్డు ఏర్పాటు  చేయాలి.  దీని ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలి” అని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.

మరోవైపు టిడ్కో ఇళ్లకు సంబంధించి.. 18 నెలల కాలంలో 2,08,160 యూనిట్లు పూర్తిచేస్తామన్న అధికారులు.. దాదాపు రూ.10వేల కోట్లు వీటికోసం ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుతోపాటు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

ఇదీ చదవండి: బొత్స మరో ఈటల కానున్నారా ? కుట్ర చేస్తున్నారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement