Saturday, May 4, 2024

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు.. కేంద్ర విదేశాంగశాఖ మంత్రికి సీఎం జగన్‌ ఫోన్‌..

రష్యా – ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను, తెలుగువారిని క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, కేంద్ర విదేశాంగశాఖ మంత్రి శ్రీ జయశంకర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉంటున్న తెలుగువారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చే విషయమై చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను జయశంకర్, ముఖ్యమంత్రికి వివరించారు. ఉక్రెయిన్‌ పక్కనున్న దేశాలకు వారిని తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ముప్పులేకుండా వారిని భద్రంగా తీసుకురావాలని సీఎం, కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

అంతకుముందు ఇదే అంశంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఢిల్లీలో ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్జాతీయ సహకారంపై ప్రత్యేక అధికారి జితేష్‌ శర్మలు పాల్గొన్నారు.

రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా వెనక్కి తీసుకురావడంపై కేంద్ర విదేశాంగశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని సీఎంకు వివరించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యిందన్నారు. జిల్లా కలెక్టర్ల స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల వివరాల సేకరణతో పాటు, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలన్నారు. కాల్‌సెంటర్లకు ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేసి ఫాలో అప్ చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement