Thursday, May 2, 2024

హెల్త్ కేర్ , ఫ్రెంట్ లైన్ వర్కర్లకు ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్…

చిత్తూరు – రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు మంగళవారం నిర్వహించనున్న ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ ను పక్కాగా నిర్వహించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, వైద్య, విద్యుత్, ఐసీడీఎస్ శాఖల అధికారులతో నగరస్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లోని ఫ్రంట్లైన్ వర్కర్స్ కు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపడుతుందన్నారు. గతంలో వ్యాక్సిన్ వేసుకోని ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్ లను గుర్తించి వారికి సమాచారం అందించాలన్నారు. గతంలో వివిధ కారణాలతో వ్యాక్సిన్ వేసుకోని వారికి ఈ సారి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలన్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వ్యాక్సిన్ వేయించుకోని వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్, సంబంధిత రికార్డులు తీసుకోవాలన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలో సత్యనారాయణపురం, కాజూరు, చవటపల్లి అర్బన్ ఆరోగ్య కేంద్రాలతో పాటు చిత్తూరు(అపోలో) ప్రభుత్వ ఆసుపత్రిలో టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్ ప్రత్యేక క్యూ ద్వారా టీకాలు వేయించాలి అన్నారు. ఇదే అంశాలపై వార్డు కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి, ఎంహెచ్వో అనిల్ కుమార్, సీఐలు యుగంధర్, నరసింహ రాజు‌, అర్బన్ హెల్త్ సెంటర్ లో వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement