Tuesday, April 30, 2024

విశాఖ క్రైమ్ సిటీగా మారింది: ఏపీ డీజీపీకి చంద్రబాబు బహిరంగ లేఖ

విశాఖ జిల్లా విద్యుత్ ఉద్యోగి బంగార్రాజు హత్యపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విద్యుత్‌ లైన్‌మెన్‌ గా పనిచేస్తూ దారుణ హత్యకు గురైన బంగార్రాజు మృతదేహం ఏనుగులపాలెంలోని మంత్రి బొత్స మేనల్లుడు లక్ష్మణరావు గెస్ట్‌ హౌస్‌ పక్కనే లభ్యమైందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. మృతదేహం లభ్యమై నాలుగైదు రోజులైనా ఇంకా పోస్ట్‌ మార్టం నిర్వహించకపోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసుల ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగి బంగార్రాజు హత్యలో అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన అగ్ర నేతల ప్రమేయం ఉండడంతోనే పోలీసులు ఈ కేసులో ముందుకెళ్లడం లేదని ఆరోపించారు. పోలీసులు సత్వరం విచారణ చేపట్టి.. బాధితులకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రశాంతతకు మారు పేరు ఉన్న విశాఖ జిల్లాలో.. నేడు శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు. భూకబ్జాలు, హత్యలతో విశాఖ క్రైమ్ సిటీగా మారిపోయిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: పెట్రో ధరలపై టీడీపీ ఉద్యమం.. ఏపీ సర్కార్ పై చంద్రబాబు ధ్వజం

Advertisement

తాజా వార్తలు

Advertisement