Sunday, May 5, 2024

AP: బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మరో నూతనాధ్యాయనం.. మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జనవరి 18(ప్ర‌భ‌న్యూస్‌): రాష్ట్రంలో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ​ముఖ్యమంత్రి వై ఎస్ జగనమెహన్ రెడ్డి దార్శనికతతో, దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించిందని రాష్ట్ర రెవిన్యూ మంత్రివ ధర్మాన ప్రసాద రావు అన్నారు. గురువారం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఆయన నివాళులార్పించారు.

అనంతరం ఆయ‌న మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి స్టీల్, ఇతడి లోహాలతో తయారుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్య మంత్రి తన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందని, ఆ మాట మేరకు విజయవాడ నది ఒడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆవిష్కరించే కార్యక్రమం శుక్రవారం జరుగుతుందన్నారు. ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటటువంటిది కాదని, దేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భారతదేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి విధానాలను, చట్టాన్ని, రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు.

ఆ కాలంలో సమాజాన్ని ముందుకు నడిపించడానికి రామాయణాన్ని, భారతాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు.. కానీ ఆధునిక భారతదేశాన్ని నడిపించడానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నామని తెలిపారు. 75 సంవత్సరాలు పూర్తయినా చెక్కుచెదరని భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి సమాజాన్ని స్థితిని కనుక్కొని అవసరమైనటువంటి వెసులు బాట్లను కల్పించి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు . శుక్రవారం విజయవాడ జరగబోయే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు హాజరై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement