Monday, April 29, 2024

టెలీ మెడిసిన్‌ సేవల్లో ఏపీ టాప్‌.. దేశవ్యాప్తంగా 2.43 కోట్ల కన్సల్టేషన్లు

అమరావతి, ఆంధ్రప్రభ : టెలీ మెడిసిన్‌ సేవల్లో ఆంధ్రప్రదేశ్​ దేశంలోనే ముందువరుసలో నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలు ఏపీకి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దేశవ్యాపప్తంగా ఈ-సంజీవిని టెలీ మెడిసిన్‌ సేవలను 2019 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో 13 హబ్‌లను రాష్ట్ర ప్రబుత్వం ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీలతోపాటు, వైయస్సార్‌ విలేజీ క్లినీక్‌లను అనుసంధానం చేసింది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రజలు ఇంటి నుండే టెలీ మెడిసిన్‌ సేవలు పొందేలా ఈ-సంజీవిని (ఓపీడీ) సేవలు గత ఏడాది నుండి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రోజువారీగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి టెలీ మెడిసిన్‌కు వస్తున్న కన్సల్టేషన్లలో అత్యధిక శబుూతం ఏపీ నుండే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం టెలీ మెడిసిన్‌ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రటించింది.

42 శాతం ఆంధ్రప్రదేశ్​ నుండే..
టెలీ మెడిసిన్‌ సేవలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా 2,43,00,635 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 42 శాతం అంటే 1,02,03,821 ఏపీ నుండి నమోదై రికార్డు సృష్టించాయి. 37,70,241 కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. రాష్ట్రం నుండి ప్రస్తుతం రోజుకు 75 వేల వరకూ కన్సల్టేషన్లు ఉంటున్నాయి. ఈ-సంజీవిని ఓపీడీ యాప్‌ను రాష్ట్రంలో ఇప్పటికే 85,351 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ సంజీవని సేవలను స్మార్ట్‌ ఫోన్లలో వినియోగించడం తెలియని, స్మార్ట్‌ ఫోన్‌లు లేనివారిలో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశావర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్టు ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించింది. త్వరలో ఆశావర్కర్ల ద్వారా ప్రజలకు టెలీ మెడిసిన్‌ సేవలను మరింత చేరువ చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 13 టెలీ మెడిసిన్‌ హబ్స్‌తో ప్రభుత్వం సేవలు అందిస్తోంది. వీటిని మరింత విస్తృతం చేయడంలో భాగంగా రూ. 5 కోట్లకుపైగా నిధులతో కొత్తగా మరో 14 చోట్ల హబ్స్‌ను ఏర్పాటుచేస్తోంది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పీడీయాట్రిక్స్‌, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉంటారు.

రోజుకు 5 లక్షల కన్సల్టేషన్ల లక్ష్యం
టెలీ మెడిసిన్‌ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిపేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఈఏడాది మార్చి నాటికి రోజుకు 2 లక్షల కన్సల్టేషన్లకు చేరుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే ఈడాది చివరి నాటికి అది 5 లక్షలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనిద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు సగటున ఏడాదిలో మూడుసార్లు టెలీ మెడిసిన్‌ సేవలు పొందేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement