Monday, April 29, 2024

AP: వరద బాధితులకు ఏలోటు రావద్దు.. సత్వరమే అన్ని ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్లకు జగన్ ఆదేశం..

అమరావతి: సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం జ‌గ‌న్ ఈ సందర్భంగా ఏమన్నారంటే…

వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండండాల‌ని సూచించారు. వారిపట్ల మానవతా దృక్పథాన్ని చూపించండి. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించండి. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు ఇవ్వాలన్నారు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.

ఇంకా ఏమ‌న్నారంటే..

గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలి, వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలి. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలి. ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించండి. వారికి అందించే సేవల్లో ఎక్కడా లోటు రానీయకూడదు. ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలి. వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలి. విద్యుత్‌పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలి, దీనిమీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. 104 కాల్‌సెంటర్‌ ఇప్పటికే ప్రజలందరికీ పరిచయం ఉందని తెలిపారు సీఎం.

వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా.. 104 నంబర్‌కు సమాచారం ఇవ్వమని చెప్పండి. 104కు ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే అధికారులు స్పందించి… బాధితులకు తోడుగా నిలవాలి. జిల్లాల్లో 104కు ప్రత్యేక అధికారిని నియమించండి. పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టిపెట్టండి. ఎక్కడ అవసరమవుతుందో.. అక్కడ పెట్టండి, ఒక డ్రైవ్‌లా చేయండి. రోడ్లను పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టిపెట్టండి. రవాణా సాగేలా ముందు తాత్కాలిక పనులు వెంటనే చేయాలి. శాశ్వతంగా చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలి. ఇప్పుడు వచ్చిన వరదల‌ను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలి. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి… పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని సూచించారు సీఎం జ‌గ‌న్‌.

- Advertisement -

పంచాయతీరాజ్, మున్సిపల్‌విభాగాలు దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా..వారికి వెంటనే నగదు ఇవ్వండి. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బు ఇవ్వండి. దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరుచేయండి. దీనివల్ల వెంటనే పనులు మొదలుపెట్టగలుగుతారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలి. ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించారు. మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవండి. నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండండి. వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోండి. ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండండి, రూ.25 లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించండి అని తెలియ‌జేశారు ముఖ్య‌మంత్రి

విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి… మిగిలిన వారిలో ధైర్యం నింపడానికే ఈ చర్యలు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి. మరణించిన పశువుల కళేబరాలవల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోండి. పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టండి. వాక్సిన్లు సహా ఇతర చర్యలు తీసుకోండి. పంటల నష్టం ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టండి: విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయండి. చెరువులు, ఇతర జలాశయాలు, కట్టల మీద దృష్టిపెట్టండి. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు నివేదికలను అందించాలి అని అధికారుల‌ను ఆదేశించారు సీఎం జ‌గ‌న్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement