Tuesday, May 14, 2024

ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు.. హక్కులను సాధించలేని అసమర్థ నాయకత్వం: శైలజానాథ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను నిలదీయాలని… అవసరమైతే యుద్ధం చేయాలని సూచించారు. బుధవారం శైలజానాథ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హక్కులను కూడా సాధించలేని అసమర్థ నాయకత్వం ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు. పరిపాలన చేతకాని జగన్ ఇన్నేళ్ల పాలనలో అప్పులు చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు.

ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎంతకాలం మభ్య పెడతారని శైలజానాథ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ గురించి పట్టించుకోని బీజేపీ రైల్వేజోన్ ఊసు కూడా ఎత్తట్లేదని వాపోయారు. రాష్ట్రానికి లోటు బడ్జెట్ కూడా ఇవ్వబోమని తెగేసి చెప్తుంటే ఇంకెంత కాలం బీజేపీని పట్టుకుని బ్రతిమాలాడతారని ఆయన విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడే మాటలు జగన్‌కు పౌరుషాన్ని తెప్పించడం లేదా అని ప్రశ్నించారు. జగన్ పరిపాలన చేయడం నేర్చుకోవాలని, ఇప్పట్నుంచైనా మొదలుపెట్టాలని శైలజానాథ్ హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో మద్దతిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం కూడా కలిసి పోరాడతారని స్పష్టం చేశారు. ఏ విషయంలో బీజేపీ మిమ్మల్ని భయపెడుతోందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం జగన్ ఎదురుచూపులు చూస్తుంటే తమకే బాధేస్తోందని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement