అమరావతి: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తప్పుబట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా వాటి ఏర్పాటు సరికాదని పేర్కొంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన నివేదికల్ని కాగ్ సమర్పించింది. వార్డు కమిటీలు లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తన ఆడిట్ నివేదికలో వెల్లడించింది. వికేంద్రీకరణ పాలన కోసమే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంది. 2019 జులైలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని కాగ్ తెలిపింది. క్షేత్రస్థాయిలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమేనని పేర్కొంది. స్వపరిపాలన సాధనకు ప్రజా ప్రతినిధులతో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇక గత ప్రభుత్వం రాజధాని కోసం భూసేకరణ విధానాన్ని తప్పు పట్టింది.. ల్యాండ్ పూలింగ్ ద్వారా 70 శాతం భూమిని సేకరించినప్పటికీ , అక్కడ మౌలిక సదుపాయాల కోసం రూ 13 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వానికి పెను ఆర్ధికభారమేనని పేర్కొంది కాగ్.. అలాగే భూసేకరణ, సద్వినియోగంపై నిపుణుల కమిటీ సూచనలను గత తెలుగుదేశం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించింది.. రాజధాని మౌలికసదుపాయల కోసం కేవలం 139 కోట్ల రూపాయిలనే ఖర్చుచేసిందని పేర్కొంది.. 2019 నుంచి రాజధాని అమరావతిలో పనులన్నీ నిలిచిపోయాయని, దీనివల్ల ప్రభుత్వానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తాయని కాగ్ తన నివేదికలో తెలిపింది.