Wednesday, May 8, 2024

మద్యం మత్తులో యువకుడి వీరంగం.. తల్లి అనుకొని ఎదురింటి మహిళపై కొడవలితో దాడి

ఇబ్రహీంపట్నం (ప్రభ న్యూస్): మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం వేశాడు. తల్లితో గొడవపడి కొడవలితో తన తల్లి అనుకొని ఎదురింటి మహిళ చేతిపై నరికాడు. మత్తులో రోడ్డుపై పడిపోయిన కుమారుడిని తల్లి గొడ్డలితో నరికి హత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్​టీఆర్​ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండల పరిధిలోని కొటికలపూడిలో ఇవ్వాల (సోమవారం) జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొటికలపూడికి చెందిన పప్పుల బాలకోటి (35) లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితం భార్యతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నాడు. త‌న భార్య ఇద్దరు కుమార్తెలతో కంచికచర్లలో నివాసం ఉంటోంది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని బాలకోటి కుమార్తెలు కొటికలపూడి వచ్చారు. ఈ క్రమంలో సోమవారం మద్యం మత్తులో ఉన్న బాలకోటి తల్లి చిట్టెమ్మ, ఇద్దరు కుమార్తెలతో గొడవ పడ్డాడు. భయంతో వారు ఎదురింటికి వెళ్లారు.

తల్లిని చంపేందుకు కొడవలితో వెళ్లిన బాలకోటి మత్తులో తన తల్లి అనుకుని ఎదురింటి మహిళ లింగమ్మను చేతిపై నరికాడు. అనంతరం రోడ్డుపై పడిపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన తల్లి చిట్టెమ్మ గొడ్డలితో కొడుకు బాలకోటి మెడపై నరికి పరారైంది. తీవ్ర రక్తస్రావమైన అతన్ని, ఎదురింటి మహిళ లింగమ్మను 108లో వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. బాలకోటి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇబ్రహీంపట్నం సీఐ కె.శ్రీధర్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement