Wednesday, May 1, 2024

పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. మంటల్లో ముగ్గురి సజీవ దహనం

చిత్తూరులోని ఓ పేపర్ ప్లేట్ల తయారీ సంస్థ‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో తండ్రీ కొడుకులు సహా ముగ్గురు సజీవ దహనమయిన‌ట్టు తెలుస్తోంది. రంగాచారి వీధిలో ఇవ్వాల (బుధ‌వారం) తెల్లవారుజామున ఈ ఘటన జ‌రిగింది. భాస్కర్ (65)కు ఉన్న రెండంతస్తుల భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. రెండో అంతస్తులో వారు నివాసం ఉంటున్నారు. రాత్రి వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కిందనున్న పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌లో మంటలు చెలరేగాయి.

క్షణాల్లోనే ఆ మంటలు రెండో అంతస్తుకు వ్యాపించాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీబాబు (35), కుమారుడి స్నేహితుడు బాలాజీ (25) ప్రాణాలు కోల్పోయారు. మంటలు చూసి అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే, వారు వచ్చేసరికే భవనాన్ని మంటలు చుట్టుముట్టేసి ముగ్గురిని బలితీసుకున్నాయి. మంటలను అదుపు చేసిన తర్వాత తలుపులు బద్దలుగొట్టిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు.

వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు చ‌నిపోయిన్టు డాక్ట‌ర్లు తెలిపారు. కాగా, ఢిల్లీబాబు మంగళవారమే పుట్టిన రోజు జరుపుకున్నాడు. వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన స్నేహితుడు బాలాజీ రాత్రి అక్కడే ఉన్నాడు. ప్రమాదంలో అతను కూడా చ‌నిపోయాడు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement