Monday, April 29, 2024

చంద్రబాబు నిర్వాకం వల్లే 800 కోట్ల లాస్​.. పోలవరం బాధ్యత మాదే: మంత్రి అంబటి

చంద్రబాబు కమీషన్ల యావ వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రంవాల్ దెబ్బతిన్నాయి.. – పోలవరం ప్రాజెక్టులో ఈజీగా పూర్తయ్యే పనులు చేసి, కమీషన్లు పుచ్చుకున్నది చంద్రబాబే.. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా స్పిల్ వే పూర్తికాకుండానే కాఫర్ డ్యాం, డయాఫ్రంవాల్ లు కట్టింది చంద్రబాబు కాదా? అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇవ్వాల తాడేపల్లి వైఎస్సార్​సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. — పోలవరం ప్రాజెక్టు ఎవరివల్ల ఆలస్యమైంది, ప్రాజెక్టును ఎవరు ఏటీఎంగా మార్చుకున్నారు..? రూ. 800 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం వల్లే అన్న విషయాన్ని ఓ పత్రికలో ఎందుకు రాయడం లేదు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అయితే..- పోలవరం పూర్తిచేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు మంత్రి అంబటి.

పోలవరం ప్రాజెక్టును ఒక్క అంగుళం కూడా తగ్గించం అని అసెంబ్లీలో సాక్షాత్తూ సీఎం జగన్​ చెప్పారు.  పోలవరం, ఆర్టీసీ ఛార్జీలపై ఎల్లో మీడియావి దొంగ మాటలు-, దొంగ రాతలు.. అని ధ్వజమెత్తారు. ఇంకా ఏమన్నారంటే…

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు,  పోలవరం ప్రాజెక్చు పరిస్థితిపై సవివరంగా మాట్లాడాలనుకున్నాను. కానీ, ఓ దినపత్రిక, దానికితోడు ఎల్లో మీడియాకు చెందిన కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు..  సందు దొరికినా, దొరకపోయినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిమీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే, ఇవాళ ఓ దినపత్రిక పోలవరం పునరావాసం రెండు ముక్కలు.. అంటూ  పెద్ద బ్యానర్‌ హెడ్డింగ్‌ పెట్టారు. అంతేకాకుండా పురగోతి 1.46 శాతం మాత్రమేనని, ఇసుక కోతకు, గుంతలు పూడ్చేందుకు, డ్రెజ్జింగ్‌ పరిష్కారంగా 800 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆ పత్రిక పెద్ద బ్యానర్‌ వార్తను వ్యంగ్యంగా రాసింది. పోలవరం ప్రాజెక్ట్‌ పై విషం చిమ్మి, ప్రజల్లో ఒక గందరగోళం కల్పించే ప్రయత్నం అది చేస్తుంది. విషం ఒక్కసారిగా ఎక్కించరు. స్లో పాయిజన్‌లా వార్తలు రాసి పోలవరం విషయంలో జగన్‌, వైయస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలు చేస్తుందనే ఒక భావన ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

అదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం శరవేగంతో పోలవరం, ఒక్కరోజులోనే అద్భుతమైనటువంటి వేల లక్షల అడుగులు కాంక్రీటు వేసేశారంటూ వార్తలు రాశారు. వాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిత్యం ప్రాజెక్ట్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టుకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి, ఇంకా సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరంపై బురదచల్లే ప్రయత్నాలు చేయవద్దని, వాటిని మానండని  ముఖ్యమంత్రిగారు ఇటీవల శాసనసభలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు.

ప్రపంచంలో ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తి చేస్తారు..

- Advertisement -

ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినా కొన్ని దశలలో పూర్తి చేస్తారు. ఒక్కసారిగా ఏ ప్రాజెక్ట్‌ పూర్తికాదు. అలా చేస్తే ప్రమాదం కూడా. ఇదేదో నేను చెబుతున్న మాట కాదు. చరిత్ర చెబుతున్న సత్యం. అనేక ప్రాజెక్టుల నిర్మాణం తీసుకుంటే నాగార్జున సాగర్‌, శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టులు దశలవారీగానే జరిగాయి. ఒక్కసారే ప్రాజెక్ట్ ను నింపేస్తే ప్రమాదం జరుగుతుంది. దానికి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. కాబట్టి దశలవారీగా ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ కమిటీ) కూడా కలిసి ఒక నిర్ణయం ప్రకారం ప్రాజెక్టు పనులను చేస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వారు డ్యాం సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది.

ఒక పోలవరం ప్రాజెక్ట్‌ ను… 45.72 మీటర్లు ఎత్తులో మొత్తం కెపాసిటీ నిండుతుంది. అంత కెపాసిటీలో ఒకేసారి నీళ్లు నింపి పునరావాసం కల్పించడం సాధ్యం కాదు. కాబట్టి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ రెండు దశలుగా డివైడ్‌ చేశారు. 41.15 మీటర్లకు ఏఏ గ్రామాలు అయితే ముంపునకు గురి అవుతాయో ముందుగా ఆ గ్రామాలకు పునరావాసం పూర్తి చేసి, 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి ప్రాజెక్ట్‌ను పరీక్షిస్తారు. ఇది మినిమం డ్రా డౌన్‌ లెవల్‌ వరకూ నింపగలిగితే కుడి, ఎడమ కాల్వలకు నీరు సరఫరా అవుతుంది. అప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని చూసిన తర్వాత, దాన్ని పెంచుకుంటూ వెళ్లి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తారు. దీన్ని  చిత్రంగా ఓ పేపర్​ వాళ్లు పునరావాసం రెండు ముక్కలంటూ వ్యంగ్యంగా రాతలు రాశారు. ఏంటిది? ధర్మమేనా ఇది?

రూ.800 కోట్లు ఖర్చు పెట్టడానికి కారకుడు చంద్రబాబే

ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ను ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంటే ప్రజల్లో ఏదో అలజడి కలిగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థం అవుతోంది. చంద్రబాబు చేసిన తప్పుడు పనుల వల్లే  రూ. 800కోట్లు మళ్లీ తిరిగి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనికి కారకుడు చంద్రబాబే.  ఆ విషయాన్ని ఆ పత్రికలో ఎందుకు రాయడం లేదు?, ఎందుకు దాస్తున్నారు..?.  ఇందుకు కారణం గత తెలుగుదేశం ప్రభుత్వం అన్నది వాస్తవం. మీ రాజకీయ దురుద్దేశాలతో గత తెలుగుదేశం ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేయడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ క్రిటికల్‌ కాంపోనెంట్స్ కు, క్లిష్టమైన పనులు చేయకుండా, కేవలం కమీషన్లు వచ్చే పనులు, సులువుగా పూర్తి అయ్యే పనులు మాత్రమే చేపట్టారు. ఎందుకంటే అవి తొందరగా అయిపోతే డబ్బులు వస్తే, తొందరగా కమిషన్లు కొట్టేసి, ఆ డబ్బులతో చంద్రబాబు కులకవచ్చు అనే ఉద్దేశమే ఇందుకు కారణం.

మీ కమీషన్ల కోసం ముందు చేయాల్సిన పనులు వెనుక.. వెనుక చేయాల్సిన పనులు ముందు

పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు ఏటీఎంగా ఉపయోగించుకున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం,  కాంట్రాక్టర్లతో పనులు చేయించడం, అందులో కమీషన్లు తీసుకుని తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మార్చుకునేటటువంటి చెత్త పనులు చేశారు. టెక్నికల్‌గా ముందు చేయాల్సిన పనులు వెనక… వెనక చేయాల్సిన పనులు ముందు చేయడం వల్లే ఈవాళ రూ. 800కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యులు తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ విషయాన్ని మాత్రం ఆ పేపర్​ వాళ్లు రాయరు. ఆ పేపర్​ పెద్దమనిషికి అది పట్టదు. జగన్‌ పరిపాలన దగ్గరకు వచ్చేసరికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు రూ. 800కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రాస్తారు. ఇలా రాతలు రాయడం ఎంత దుర్మార్గం, ఇది ధర్మమేనా అని అడుగుతున్నాను.

ఇక ఇసుక కోత, గుంతలు, డ్రెడ్జింగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే… భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇసుక పొరలు ఎక్కువగా ఉండటంతో పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి నది డైరెక్షన్‌ మార్చి అక్కడొక స్పిల్‌వే కట్టి,  అక్కడ రిజర్వాయర్‌ డ్యామ్‌ కట్టి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి, స్పిల్‌ వే పూర్తి చేసి, దానిద్వారా వాటర్‌ పంపించి, ఆ తర్వాత డ్రయాఫ్రమ్‌ వాల్ కట్టి అనంతరం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేయాలి. చంద్రబాబుఏం చేశారంటే… స్పిల్‌వే పట్టించుకోకుండా, కేవలం కాఫర్‌ డ్యామ్‌లు కట్టడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం చేశారు.

రెండు గ్యాప్‌లు ఉండటం వల్ల.. గ్యాప్‌-1లో ప్లస్‌ 23 నుంచి మైనస్‌ 12 వరకూ దాదాపు 35మీటర్ల మందం కోతకు గురైంది. గ్యాప్‌-2లో ప్లస్‌ 8 నుంచి మైనస్‌ 12 వరకూ దాదాపు 20 మీటర్ల మందం దిగువ కాఫర్‌ డ్యామ్‌ మైనస్‌ 22.5 మీటర్ల వరకూ కోతకు గురైంది. దీంతో వాటి మరమ్మతుల నిమిత్తం అదనంగా 800కోట్లు ఖర్చు పెట్టాల్సిన అనివార్యమైన పరిస్థితి వస్తే … ఈ దినపత్రిక ఇవాళ మెయిన్‌ పేజీలో రెండు ముక్కలు… మూడు ముక్కలు అని రాస్తారా?  చంద్రబాబు, వారి గెజిట్ పత్రిక అయిన ఆ పేపర్​ చేసే కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి.

ప్రపంచంలోనే తొలిసారి ఇలా జరగడం..

కాఫర్‌ డ్యామ్‌లు నిర్మాణం చేసి, స్పిల్‌వే పూర్తికాకుండా ఉండటంతో విపరీతమైన వరదలు రావడం సహజం. 2019లో విపరీతమైన వరద నీరు రావడంతో ఒక్కసారిగా కాఫర్‌ డ్యామ్‌కు 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిపడింది. దాంతో డయాఫ్రమ్‌ వాల్ కొట్టుకుపోవడం, కాఫర్‌ డ్యామ్‌లు దెబ్బతినడంతో వాటిని మళ్లీ పునర్‌ నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకూ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదు. ప్రపంచంలోనే తొలిసారి ఇలా జరగడం… ఈ ఘనత నారా చంద్రబాబుదే, తెలుగుదేశం పార్టీదే. దీనికి బాధ్యులు చంద్రబాబు కాదా? దాన్ని ఆ పేపర్​తోపాటు, ఎల్లో మీడియా రాయదా? అదేదో మా బాధ్యత అన్నట్లు రాతలు రాస్తున్నారు.

ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్ విధిస్తే దానిమీదా రాద్ధాంతమా..?

ఆర్టీసీ ఛార్జీలు పెంచేశామని ఎల్లో మీడియాలో ఇష్టం వచ్చినట్టు కట్టు కథలు రాస్తున్నారు. అవును, అనివార్య పరిస్థితుల్లో కరెంట్‌ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి.  కేంద్ర  ప్రభుత్వం దాదాపు, రోజూ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంది. డీజిల్ ధర రూ. 67 నుంచి రూ. 107కు పెరిగిందని తెలుగుదేశం  పార్టీ ఛానళ్ళకు, పత్రికలకు తెలియదా..? అలా పెరిగినప్పుడు అంతో, ఇంతో సెస్ రూపంలోనో, మరో రూపంలోనో  కొంతమేరైనా భారం మోపడం తప్ప మరో మార్గం ఉండదు. దానికే మేమేదో ఆర్టీసీ ఛార్జీలను అడ్డగోలుగా పెంచేశామని, ప్రజలను లూటీ చేసేస్తున్నామని,  ప్రజల జేబులు కొట్టేస్తున్నామంటూ అడ్డగోలు రాతలు రాస్తూ చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయినా ఇదే చేసింది. ఏ ప్రభుత్వం అయినా ఇంతే చేస్తుంది. ఈ సెస్ వల్ల వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాలోకి వెళితే, ఈనాడుకు బాధ ఎందుకో అర్థం కావడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement