Thursday, May 9, 2024

Water Matters | ఇదే ఫైనల్ ! ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం.. కృష్ణా జలాలపై కేంద్ర జలశక్తి స్పష్టత

అమరావతి, ఆంధ్రప్రభ : కృష్ణా జలాల పున:పంపిణీ చేయాలంటూ తెలంగాణ చేస్తున్న వాదనలు సాంకేతికంగా, చట్టబద్దంగా చెల్లుబాటయ్యే అవకాశాలు కనబడటం లేదు. బచావత్‌ ట్రిబ్యునల్ అవార్డును అనుసరించి రాష్ట్ర పునర్విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్ర మధ్య కుదిరిన అధికారిక ఒప్పందాలను తిరగదోడటం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు 2023-24 నీటి సంవత్సరంలోనూ కృష్ణాలో 66:34 శాతానికి కట్టుబడి పర్యవేక్షణ చేపట్టాలనీ, రూల్‌ కర్వ్స్‌ (నిర్వహణ, నియమావళి) ఖరారు చేయాలని కేఆర్‌ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు)కి కేంద్ర జలశక్తి నుంచి తాజాగా మార్గనిర్దేశకాలు అందినట్టు తెలిసింది. రిజర్వాయర్లు, సాగుయోగ్యమైన భూమి, నీటిపారుదలకు అవకాశమున్న స్థిరీకరణ ఆయకట్టును అనుసరించి బచావత్‌ ట్రిబ్యునల్ కృష్ణా జలాల్లో ఏపీ 66, తెలంగాణకు 34 శాతం కేటాయింపులు చేసింది.

2014 రాష్ట్ర పునర్విభజన అనంతరం కేంద్ర జలశక్తి సమక్షంలో రెండు రాష్ట్రాల్ర మధ్య రాతపూర్వక ఒప్పందాలు కూడా కుదిరాయి. తెలంగాణ మాత్రం ఆ ఒప్పందాలను తిరగోడాలనీ, కృష్ణా జలాలను 50:50 శాతం ప్రాతిపదికన పున:పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. పున:పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కూడా వాదిస్తోంది. ఈ మేరకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు హామీతో గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ పున:పంపిణీ చేసి తీరాలని పట్టుబడుతోంది.

- Advertisement -

తెలంగాణ వాదనపై సమగ్ర అధ్యయనం చేయటమే కాకుండా న్యాయ నిపుణులతో చర్చించిన కేంద్ర జలశక్తి పున:పంపిణీ సాధ్యం కాదని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ -1 (కేడ డబ్ల్యుడీటీ – బచావత్‌ ట్రిబ్యునల్) అవార్డును అనుసరించి 66:34 శాతం మేరకే కేటాయింపులుంటాయని కేంద్ర జలశక్తి కృష్ణా బోర్డుకు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

అదనపు జలాల కోసమే బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్ ఆదేశాలు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం.. అందువల్లనే బచావత్‌ తరువాత బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్ వచ్చినా పాత్ర ట్రిబ్యునల్ ఆదేశాలను తిరగదోడలేదని ఏపీ గుర్తు చేస్తోంది. అంతర్‌ రాష్ట్ర నదీ వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్డబ్ల్యూడీ) 1956 చట్టంలోని సెక్షన్‌6 (2) ప్రకారం కొత్త ట్రిబ్యునళ్ళు పాత ట్రిబ్యునల్ ఆదేశాలను పున:సమీక్షించటానికి ఏర్పడవు. అపరిష్కృతంగా ఉన్న వివాదాల పరిష్కారం, కొత్తగా అందుబాటులోకి వచ్చిన జలాలను పంపిణీ చేయటానికే కొత్త ట్రిబ్యునళ్ళు పనిచేస్తాయి..అందువల్లనే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేవలం కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అదనంగా అందుబాటులోకి వచ్చే 163 టీ-ఎంసీలు, వరదల సమయంలో ఒనగూరే 285 టీఎసీంసీల మిగులు జలాలు.. మొత్తం 448 టీఎంసీలను ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు పంచే విషయానికే పరిమితమైందని నిపుణులు చెబుతున్నారు.

చట్ట ప్రకారం బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేవలం బచావత్‌ పంపిణీ చేసిన 811 టీఎంసీలకు అదనంగా కొత్తగా నీటి లభ్యతను గుర్తిస్తే ఆ జలాలను పంపిణీ చేయటానికి మాత్రమేపరిమితమవుతుంది..కొత్తగా నీటి లభ్యతను గుర్తించినందు వల్లనే విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌ లో ఏపీలో అదనంగా నాలుగు ప్రాజెక్టులకూ, తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు కృష్ణా జలాలను కేటాయించారు. ఏపీలో తెలుగుగంగ విస్తరణకు 29, గాలేరు-నగరి ప్రాజెక్టుకు 38, హంద్రీనీవాకు 40, వెలిగొండ కు 43.50 టీఎంసీలు.. మొత్తం 150.50 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణలోని కల్వకుర్తికి 25, నె-్టట-ంపాడుకు 22 టీఎంసీలు..మొత్తం 47 టీఎంసీలు కేటాయించారు. దీనిపై తెలంగాణకు స్పష్టత ఉన్నా వివాదం రగలించటం ద్వారా కృష్ణా జలాల్లో అదనపు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తోందని ఏపీలోని నీటిపారుదల నిపుణులు భావిస్తున్నారు.

కొత్త ట్రిబ్యునల్‌ కావాలి

రాష్ట్ర పునర్విభజన తరువాత రెండు రాష్ట్రాల్ర మధ్య కుదిరిన ఒప్పందాలు ఒక ఏడాదికి మాత్రమే పరిమితమని తెలంగాణ వాదిస్తోంది. 50:50 శాతం కృష్ణా జలాల పున:పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలకు మించి వినియోగించుకునేందుకు ఏపీకి హక్కులు లేవు.. అయినా శ్రీశైలం జలాలను కృష్ణా బేసిన్‌ అవతలకు ఏపీ తరలిస్తోంది.. ఉమ్మడి రాష్ట్రాల్రకు కేటాయించిన కృష్ణా జలాల్లో 20 శాతం తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ చెప్పినా అమలు కావటం లేదు.. నిబంధనల ప్రకారం ఒక ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్‌ చేయాల్సి ఉంటుంది.. చెన్నై తాగునీటి సరఫరా కోసం 1976,77లో చేసుకున్న ఒప్పందాలకు లోబడి రూల్‌ కర్వ్స్‌ ఖరారు చేయాలి.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వద్ద జలవిద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి రూల్‌ కర్వ్స్‌ ను సవరణ చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement