Monday, April 29, 2024

Flash: ట్రాక్టర్ ను ఢీకొన్న మినీ బస్సు బోల్తా.. ఐదుగురికి గాయాలు

చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని చంద్రగిరి మండలం కోదండరామపురం సమీపంలోని సర్వీస్ రోడ్డు లో ఘటన ట్రాక్టర్ ను మినీ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. మామిడి చెట్లకు మందులను పిచికారి చేసి వస్తున్న ట్రాక్టర్ ను ఢీకొని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. నిశ్చితార్థం కోసం 18 మందితో దామలచెరువు వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెస్ట్ డి.ఎస్.పి నరసప్ప సిబ్బందితో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, చిత్తూరు జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇందుకోసం వేణు కుటుంబ సభ్యులు ధర్మవరం నుంచి ప్రైవేటు బస్సులో నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు 63 మందితో కలిసి తిరుచానూరు బయలుదేరారు. రాత్రి 8 గంటల సమయంలో పీలేరులోని ఓ దాబా వద్ద ఆగి అందరూ భోజనాలు చేసి తిరిగి బయలుదేరారు. అక్కడి నుంచి సరిగ్గా 9 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత భాకరాపేట ఘాట్ రోడ్డు వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక మూల మలుపు వద్ద బస్సు అదుపుతప్పి 60 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి కాళ్లు, చేతులు విరిగాయి. కొందరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement