Wednesday, May 29, 2024

Jet Airways : నరేశ్‌ గోయల్‌ సతీమణి కన్నుమూత..

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ కు సతీవియోగం కలిగింది. ఆయన భార్య అనితా గోయల్ ఇవాళ‌ ఉదయం కన్నుమూశారని కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత కొద్దికాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధడుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. మరోపక్క నరేశ్‌ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆయనకు ఇటీవలే బెయిల్‌ మంజూరైంది. తనతోపాటు తన భార్య అనిత కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నందున బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన బాంబే హైకోర్టు.. రెండు నెలల తాత్కాలిక ఊరట కల్పించింది.

దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్ కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరు 1న నరేశ్‌ గోయల్‌ను అరెస్టు చేసింది. అదే ఏడాది నవంబర్‌లో గోయల్‌ భార్యను అరెస్ట్‌ చేసినప్పటికీ.. ఆమె అనారోగ్య పరిస్థితి కారణంగా ప్రత్యేక కోర్టు అదేరోజు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. 2015 నుంచి అనితా గోయల్ జెట్ ఎయిర్‌వేస్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయినప్పటికీ ఆమె బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో భాగంగానే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement