Tuesday, April 30, 2024

యువకుడి ప్రాణం తీసిన ఎన్ఓసి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ యువకుడి ప్రాణం తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గణపురం మండల కేంద్రంలోని ఓ షోరూమ్ లో 12 రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్ఓసి కోసం మండల కేంద్రానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి యజమానిని అడిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ప్రశాంత్ మరికొందరు యువకులతో కలిసి  మరోసారి షోరూం వద్దకు వెళ్లి ఘర్షణకు దిగారు. దీంతో షోరూమ్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షోరూమ్ వద్ద ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన ప్రశాంత్.. ఏప్రిల్ 12వ తేదీన రాత్రి బండారుపల్లిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ శనివారం మరణించాడు. దాంతో యువకుడి కుటుంబంతో పాటు గణపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రశాంత్ మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement