Thursday, May 2, 2024

MDK: వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కృషి.. మంత్రి హరీష్ రావు

సిద్దిపేట ప్రతినిధి, ఆగస్టు9 (ప్రభన్యూస్) : వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించుటకై లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం చెక్కులను మంత్రి అందజేశారు. నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాల్లోని 200మంది లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ…. బ్యాంకుల ద్వారా షూరిటీ, గ్యారెంటీ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, నేతన్నలకు 50శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వ కొనుగోలు, చేనేత మిత్ర కార్యక్రమం చేపట్టారన్నారు.


మత్స్యకారుల కోసం నీటి వనరుల్లో ఉచిత చేప పిల్లలు పంపిణీ, 600కోట్ల రూపాయలు వ్యయం చేసి మత్స్యకారులకు లూనాలు, మోపెడ్ల పంపిణీ, గీత కార్మికులకు చెట్లు పన్ను, పాత బకాయిల రద్దు, సొసైటీల పునరుద్ధరణ, ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో మోడల్ దోబీ ఘాట్ నిర్మాణం జరిగిందన్నారు. సిద్దిపేట దోబీఘాట్ స్ఫూర్తితో హైదరాబాదులో కూడా దోబీ ఘాట్ నిర్మించుకున్నారనీ, కుమ్మరుల అభివృద్ధి కోసం సిద్దిపేటలో 2 కోట్ల 20 లక్షల రూపాయలతో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం మట్టికుండలు, మట్టి వంట పాత్రలు, మట్టి గ్లాసులు తదితర మట్టి పాత్రల తయారీ కోసం మోడల్ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ సిద్దిపేటలో చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమాలను చూసి వారి జిల్లాల్లో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మొత్తం 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా, ప్రస్తుతం 1012 ఏర్పాటు చేసుకున్నామన్నారు.


ప్రతి ఒక్క మండలంలో ఒక బీసీ, ఒక ఎస్సీ, ప్రతి నియోజకవర్గానికి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికీ ఎస్సీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ ఉందని, జిల్లాలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. త్వరలోనే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోబోతున్నట్లు చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీ వరకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సంభంధిత మండలాల ప్రజాప్రతినిధులు, బీసీ అభివృద్ధి శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement