Thursday, May 2, 2024

Breaking: ​రాఫెల్ డీల్‌లో గోల్‌మాల్‌ బ‌య‌ట‌పెడ‌తాం.. సుప్రీం కోర్టులో కేసు వేస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ఇవ్వాల సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీపైనా, బీజేపీ నేతలపైనా నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో… బీజేపీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంతే అని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని వ్యాఖ్యానించారు.

“విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మేహుల్ చోక్సీ వంటి వ్యక్తులు ఏంచేశారో తెలియదా? ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని విడిచి పారిపోయినవాళ్లంతా ప్ర‌ధాని మోదీ దోస్తులే. ఎవడైనా మగాడు ఈ అంశాలపై మాట్లాడాలి. ఇవన్నీ వదిలిపెట్టి నన్ను జైలుకు పంపుతామని అంటున్నారు. వీళ్లను చూస్తే నిజంగా జాలి కలుగుతుంది.. దమ్మున్నవాళ్లయితే నన్ను జైల్లో వేయాలి కదా! వచ్చి నన్ను జైల్లో వేయండి.. అయినా జైల్లో వేస్తా అనగానే ఎవరో తోకగాళ్లు భయపడతారు కానీ, మాకేం భయం! అంటే సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.

మమ్మల్ని కాదు.. మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై మొత్తం చిట్టా ఉంది. ఢిల్లీ కోట బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ గురించి రాహుల్ గాంధీ ఎప్పటినుంచో పోరాడుతున్నారు. మేం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం. మోదీ సర్కారు దీంట్లో వేల కోట్లు మింగింది. ఈ దొంగతనాన్ని మేం బయటపెడతాం. మన కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నిన్న ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధవిమానాలను కేవలం 8బిలియన్ డాలర్లకే కొన్నది. మన కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసింది. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలియడంలేదా ఎవడు దొంగ అనేది? ఎవడు జైలుకు పోతాడో వాడే పోవాలి కదా! నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతాం” అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement