నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీగా ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే సరస్వతి బ్యారేజీకి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకు 4500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు సమాచారం.
అందువల్ల సరస్వతి బ్యారేజీ లోతట్టు ప్రాంతాల ప్రజలను గోదావరి నదిలోకి వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తం ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 1.మహదేవ్పూర్, 2.కాటారం, 3.చెన్నూర్, 4.కోటపల్లి మండలాలకు సంబంధించిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సరస్వతి బ్యారేజ్ డీవైఈఈ M. సతీష్, డీఈఈ పి.రవిచంద్రలు సూచించారు.