Saturday, April 27, 2024

భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం… మంత్రి ఎర్ర‌బెల్లి

జనగామ : కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన‌ట్లు తాను భూములను కబ్జా చేశానని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమ‌ని, నువ్వు సిద్ధమా అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. శుక్రవారం జనగామ జిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ముఖ్యమంత్రికి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సంక్షేమ, అభివృద్ధి పథంలో న‌డిపిస్తున్నారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం ఎడారిగా మారిందని, అలాంటి తరుణంలో ఈ ప్రాంతాన్ని డెవ‌ల‌ప్ మెంట్ చేసేందుకు దేవాదుల కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా నీరిచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు. తాను కబ్జా చేశాన‌ని రేవంత్ రెడ్డి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమ‌ని సవాల్ విసిరారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ గా ఎన్నో కేసులున్నాయని, త‌నపై ఏ ఒక్క కేసు ఉన్నా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఉద్యమ నేపథ్యంలో ఉన్నాయి తప్ప భూముల కబ్జా, బ్లాక్ మెయిలింగ్ అలాంటివి ఏ ఒకటి ఉన్నా దేనికైనా సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి బిజెపి పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా గోడలపై రాతలు రాసే ఆయన బిజెపిని బ్రష్టు పట్టించడం, టిడిపిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో చంద్రబాబు ఏజెంట్ గా పనిచేయడమే తప్ప రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన దాఖలాలు లేవన్నారు. ఆయన ఐరన్ లెగ్ అని, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ భ్ర‌ష్టు పట్టి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘ‌న్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్య, ఎంపీపీ మేకల కళింగరాజు, తదితరులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement